UPDATES  

NEWS

 ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేల సందడి..!

హైదరాబాద్ నగరంలోని చారిత్రాత్మక ఎల్బీ స్టేడియం అరుదైన క్రీడా సంబరానికి వేదికైంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ‘లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి ఈ అద్భుత వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. రాజకీయాల్లో నిత్యం ప్రజా సమస్యలు, ఒత్తిడి మధ్య బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు ఇవాళ తమలోని క్రీడాకారులను బయటకు తీశారు. పార్టీలను, రాజకీయాలను పక్కన పెట్టి నాయకులంతా ఒకే తాటిపై క్రీడా స్ఫూర్తిని చాటుకోవడం విశేషం.

 

ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బరిలోకి దిగి ఫుట్‌బాల్ ఆడారు. మైదానంలో ఎంతో చురుగ్గా కదులుతూ సీఎం ఏకంగా నాలుగు గోల్స్ సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ మొత్తంలో ఐదు గోల్స్ నమోదు కాగా అందులో నాలుగు గోల్స్ ముఖ్యమంత్రి టీమ్ ఖాతాలోకే వెళ్లాయి. రేవంత్ రెడ్డి ప్రతిభను చూసి సహచర ఎమ్మెల్యేలు ఆయనను భుజాలపైకి ఎత్తుకుని గాల్లోకి ఎగురవేస్తూ సంబరాలు చేసుకున్నారు. అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

 

అంతకుముందు జరిగిన టగ్ ఆఫ్ వార్ (తాడు లాగే ఆట) పోటీలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. ఎమ్మెల్యేలు రెండు టీంలుగా విడిపోయి బలాబలాలను నిరూపించుకునే ప్రయత్నం చేశారు. గెలుపు కోసం రెండు వైపులా నాయకులు గట్టిగా తాడును లాగారు. ఈ క్రమంలో బలం తట్టుకోలేక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది నాయకులు ఒక్కసారిగా కిందపడిపోయారు. అయినప్పటికీ వారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా చిరునవ్వు చిందిస్తూ తిరిగి లేచి ఆటను కొనసాగించారు. రాజకీయ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఇలాంటి క్రీడలు ఎంతో దోహదపడతాయని నాయకులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

 

ఈ క్రీడా పోటీలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఇవాళ ఎల్బీ స్టేడియంలో వివిధ రకాల ఆటల పోటీలు ముగియగా రేపు రవీంద్ర భారతిలో సాంస్కృతిక పోటీలు జరగనున్నాయి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు తమలోని కళాత్మక నైపుణ్యాన్ని రేపటి వేడుకల్లో ప్రదర్శించనున్నారు. క్రీడలు మనుషుల మధ్య అనుబంధాన్ని పెంచుతాయని ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు వేదికగా నిలుస్తాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |