UPDATES  

NEWS

 సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం… టీమిండియా స్ఫూర్తితో పనిచేయాలని దిశానిర్దేశం..

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన భద్రత, నిత్యావసరాల సరఫరా, రాష్ట్రాల సన్నద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో… చమురు, గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తితో సమన్వయంతో పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.

 

అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన నాటి నుంచి పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సంఘర్షణ ప్రభావం భారత్ ఇంధన దిగుమతులు, ఎరువుల సరఫరా, ఇతర వాణిజ్య కార్యకలాపాలపై పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఈ సమీక్ష చేపట్టారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా చూడటం, సరఫరా గొలుసును పటిష్ఠపరచడం, నల్లబజారు, కృత్రిమ కొరతను నివారించడం వంటి అంశాలపై ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేశారు.

 

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సహా పలువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అయితే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలులో ఉన్నందున తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరుకాలేదు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో క్యాబినెట్ సెక్రటేరియట్ విడిగా సమావేశమవుతుందని కేంద్రం తెలిపింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |