మహబూబ్ నగర్ లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లాలో గురువారం ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఈ ఉప ఎన్నికలో 99.86 శాతం మంది ఓటర్లు ఎంతో అమూల్య మైన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 99.86 శాతం ఓటింగ్ నమోదైందని.. ఎన్నికల అధికారులు వెల్లడించారు. జిల్లా మొత్తంగా 10 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఓటింగ్ ప్రక్రియ జరిగింది. అయితే జిల్లా మొత్తంలో 1439 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1437 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు.
ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. నారాయణ పేట, నాగర్ కర్నూల్ పోలింగ్ కేంద్రాల వద్ద ఆ ఇద్దరు ఓటు వేయాల్సి ఉండగా.. వారు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మిగిలిన అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు.
మహబూబ్ నగర్ లో 245 మంది ఓటర్లు ఉంటే 245 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వనపర్తిలో 218 ఓట్లు, కొల్లాపుర్ పోలింగ్ కేంద్రంలో 67 మంది, వనపర్తి పోలింగ్ కేంద్రంలో 218 మంది, గద్వాల్ పోలింగ్ కేంద్రంలో 225 మంది, అచ్చంపేటలో 79 మంది, కల్వకుర్తిలో 72 మంది, షాద్నగర్ లో 171 మంది ఓటర్లు ఉండగా.. వారు ఆయా పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగియగా.. ఏప్రిల్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. అయితే ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి కల్వకుర్తిలో ఎమ్మెల్సీగా గెలుపొందడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కొక్కరు పోటీ చేయగా.. మరో అభ్యర్థిగా స్వతంత్రుడిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో నిలిచారు.
అయితే ఈ ఉప ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికలో ఎవరికి వారే తమ అభ్యర్థి గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళిని బట్టి గెలుపు తమదేనని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి