లోక్సభ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించిది బీజేపీ. ఏపీలో ఆరు, తెలంగాణలో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను అనౌన్స్ చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి లిస్ట్ విడుదల చేసింది. ఆ లిస్టులో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఊహించని షాక్ తగిలింది. పార్టీ ఏదైనా కూటమి టికెట్ తనకే వస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. తీరా.. బీజేపీ విడుదల చేసిన జాబితాలో నర్సాపురం టికెట్ను భూపతి వర్మ శ్రీనివాసరాజుకు కేటాయించారు.
తనకు నర్సాపురం టికెట్ రాకుండా సీఎం జగన్ అడ్డుకున్నారంటూ రఘురామ కృష్ణంరాజు కామెంట్ చేశారు. బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ద్వారా ప్రయత్నించి.. తన సీటు రాకుండా చేసి విజయం సాధించారని ఆరోపించారు. ఈ విషయంలో ఓటమిని అంగీకరిస్తున్నానంటూ రఘురామ కృష్ణంరాజు కామెంట్ చేశారు. ఈ మేరకు X లో ఒక వీడియో విడుదల చేశారు.
తనకు టికెట్ కేటాయించకపోవడం కొందరికి ఆనందాన్నిచ్చినా.. చాలా మంది బాధపడుతున్నారన్నారు. తనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని, కానీ ఆన్సర్ చేయలేక చూస్తుండిపోతున్నానన్నారు. తనకు కూటమిలో టికెట్ రాకపోవడంపై ఆందోళనగా లేనని తెలిపారు. బీజేపీ ప్రత్యేక పరిస్థితుల్లో నర్సాపురం టికెట్ ను వేరొకరికి కేటాయించిందన్నారు. ఇదంతా నీలి ఛానల్స్ చేసిన కుట్ర అని, వారందిరికీ ఇది ముందే తెలుసన్నారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి.. తనను అరెస్ట్ చేయించి జెయిల్ లోనే చంపాలని చూశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా చాలా ప్రయత్నాలు చేశారు కానీ.. వాళ్ల వల్ల కాలేదన్నారు. టెంపరరీగా తన ఓటమిని అంగీకరిస్తున్నానన్నారు. మూడు అడుగులు వెనక్కి వేస్తున్నా.. నాలుగో అడుగు ప్రజల అండతో ముందుకు వేస్తానన్నారు. “జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు మార్చుకుంటా” అని ఛాలెంజ్ చేశారు.









