తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారనే వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ తన రాజకీయాలను ఆంధ్రప్రదేశ్కే పరిమితం చేసుకోవాలని, తెలంగాణలో ఆయనకు పనిలేదని హితవు పలికారు. గతంలో తెలంగాణ భాష, సంస్కృతిని పవన్ అవమానించారని ఆరోపిస్తూ.. ఆయనను ‘దిష్టి కల్యాణ్’ అంటూ సంబోధించి వివాదానికి తెరలేపారు. మున్సిపల్ ఎన్నికల్లో పవన్ ప్రచారం వల్ల కాంగ్రెస్కు వచ్చే నష్టమేమీ లేదని మహేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
మహేశ్ గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన విభాగం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా అత్యంత తీవ్రంగా స్పందించింది. జనసేన అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం పెట్టిన పార్టీ కాదని, జాతీయ సమగ్రత కోసం తెలంగాణలోనే పుట్టిన పార్టీ అని గుర్తు చేసింది. కాంగ్రెస్, బీజేపీ తరహాలోనే జనసేన కూడా జాతీయ భావాలున్న పార్టీ అని పేర్కొంది. ప్రాంతీయ విభేదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే సహించేది లేదని కాంగ్రెస్ నాయకత్వాన్ని హెచ్చరించింది.
పవన్ కల్యాణ్ను వ్యక్తిగతంగా దూషించడం ద్వారా కాంగ్రెస్ తన నైతిక పతనాన్ని చాటుకుంటోందని జనసేన నేతలు మండిపడ్డారు. తెలంగాణలో తమ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని స్పష్టం చేశారు. ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తిని ‘దిష్టి కల్యాణ్’ అని పిలవడం మహేశ్ గౌడ్ అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ మాటల యుద్ధంతో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.









