చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి ఆర్.కె. రోజా మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ ప్రసాదంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూ కల్తీ అంశంపై సీబీఐ సమర్పించిన నివేదికను ఉటంకిస్తూ.. ప్రభుత్వంపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై రోజా స్పందిస్తూ.. సీబీఐ ఇచ్చిన నివేదిక విమర్శకుల చెంపదెబ్బ వంటిదని అభివర్ణించారు. 310 ఏళ్ల ఘనచరిత్ర కలిగిన తిరుమల ప్రసాదంపై అబద్ధాలు ప్రచారం చేయడం దారుణమన్నారు. ఐసీఏఆర్ , జాతీయ పరిశోధన సంస్థల పర్యవేక్షణలో జరిగిన పరీక్షల్లో నెయ్యిలో పంది కొవ్వు గానీ, చేప నూనె గానీ లేవని తేలిందని ఆమె పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే శ్రీవారి ప్రతిష్టను దిగజార్చేలా ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా రోజా విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ కేవలం ప్యాకేజీ కోసమే డ్రామాలు చేస్తున్నారని, చంద్రబాబు డైరెక్షన్లో నడిచే ఓ రాజకీయ నటుడని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని విజయవాడ వరదల నుండి మళ్లించడానికే ఈ లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ (SIT) ద్వారా విచారణ జరిపి ఉంటే నిజాలు బయటకు వచ్చేవి కావు కాబట్టే, న్యాయ పర్యవేక్షణలో జరిగిన విచారణలో నిజం వెల్లడైందని ఆమె అన్నారు.
అసత్య ఆరోపణలతో భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు పాలకులందరూ నైతికంగా రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు. భక్తులందరూ వీరిని నిలదీయాలని, ప్రధాని మోదీ ఈ విషయంలో తక్షణమే స్పందించాలని కోరారు. దేవుడిపై విషం చిమ్మిన వీరికి సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి శిక్షించాలని అన్నారు. గతంలో ఎన్టీఆర్పై కూడా ఇలాగే విషప్రచారం చేశారని గుర్తు చేస్తూ.. ఇప్పుడు లడ్డూను రాజకీయం చేస్తున్న వీరిని ప్రజలు తరిమికొట్టే రోజు వస్తుందని హెచ్చరించారు.









