UPDATES  

NEWS

 ఏపీకి ‘గేమ్ ఛేంజర్’ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్: కాకినాడలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ శంకుస్థాపన!

ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్లాంట్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ‘గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ’గా తీర్చిదిద్దే లక్ష్యంతో కాకినాడలో ప్రతిష్టాత్మకమైన గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ‘ఏఎం గ్రీన్’ (AM Green) సంస్థ ఆధ్వర్యంలో సుమారు 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో, 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా పరిశ్రమగా నిలవడమే కాకుండా, భవిష్యత్తులో ప్రపంచం మొత్తం కాకినాడ వైపు చూసేలా చేస్తుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

ఉత్పత్తి లక్ష్యాలు మరియు ఉపాధి అవకాశాలు: ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియాను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనితో పాటు ఏటా 1,950 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్లను కూడా ఈ సంస్థ ఉత్పత్తి చేయనుంది. 2027 నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభం కానుండగా, ఇక్కడి నుండి ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమోనియాను జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 2,600 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు: పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో గ్రీన్ ఎనర్జీ ప్రాముఖ్యతను సీఎం చంద్రబాబు నొక్కి చెప్పారు. ఏపీకి ఉన్న 1000 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం, రాబోయే 20 పోర్టులు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఎంతో అనుకూలమని ఆయన పేర్కొన్నారు. 2014లోనే తమ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి పునాదులు వేసిందని, ఇప్పుడు గ్రీన్ అమోనియా ప్రాజెక్టుతో 2047 నాటికి ఏపీని ‘స్వర్ణాంధ్రప్రదేశ్’గా మార్చడమే తమ ధ్యేయమని వెల్లడించారు. నాడు ఎన్టీఆర్ కృషితో వచ్చిన నాగార్జున ఫెర్టిలైజర్స్ తరహాలోనే, ఈ ప్రాజెక్ట్ కూడా ఏపీ పారిశ్రామిక రంగంలో మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |