వైద్యశాఖలో భారీ నియామకాలు: తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 850 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ శాసనసభ వేదికగా ప్రకటించారు. నిమ్స్ (NIMS) ఆసుపత్రిపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడంతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
అత్యాధునిక పరికరాల కొనుగోలు: ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయికి ధీటుగా బలోపేతం చేసేందుకు భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 490 వెంటిలేటర్లు, నిమ్స్లో అదనంగా 125 వెంటిలేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు రోగ నిర్ధారణ పరీక్షల కోసం 9 కొత్త ఎంఆర్ఐ (MRI) యంత్రాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల నిరుపేదలకు ఖరీదైన పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి.
అంబులెన్స్ సేవల్లో విప్లవాత్మక మార్పులు: అత్యవసర వైద్య సేవల రెస్పాన్స్ సమయాన్ని భారీగా తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 13 నిమిషాలుగా ఉన్న అంబులెన్స్ రెస్పాన్స్ టైమ్ను, కొత్తగా 79 అంబులెన్స్లను ప్రవేశపెట్టడం ద్వారా 10 నిమిషాలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వివరించారు. అలాగే బస్తీ దవాఖానాలకు నేరుగా మందుల సరఫరా చేసే కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని, డయాలసిస్ రోగుల కోసం ప్రతి 25 కి.మీలకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.









