మంచు మనోజ్ సుదీర్ఘ విరామం తర్వాత హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో బ్రిటీష్ ఇండియా కాలం నాటి నేపథ్యంలో ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. అయితే, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ శింబు అతిథి పాత్రల్లో నటిస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి మనోజ్ ముగింపు పలికారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన టీజర్ లాంచ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ఆ వార్తల్లో నిజం లేదని, ఆ పాత్రల కోసం తాము ఇంకా ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.
సినిమాలో అతిథి పాత్రలకు మంచి అవకాశం ఉందని, కానీ వాటిని ఖరారు చేయడానికి ఇంకా సమయం ఉందని మనోజ్ వివరించారు. సరైన సమయం వచ్చినప్పుడు ఆ వివరాలను తానే స్వయంగా వెల్లడిస్తానని మీడియాకు తెలిపారు. ఇదే క్రమంలో సినిమాలోని మరో ఆసక్తికరమైన విషయాన్ని ఆయన పంచుకున్నారు. ఈ చిత్రంలో ‘వార్ డాగ్’ అనే ప్రత్యేకమైన బైక్ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. ‘కల్కి 2898 AD’ చిత్రంలోని ‘బుజ్జి’ కారును డిజైన్ చేసిన బృందమే ఈ 700 కేజీల బరువున్న భారీ బైక్ను కూడా తయారు చేయడం విశేషం.
చారిత్రక నేపథ్యంలో సాగే కథ కావడంతో, మేకింగ్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో మనోజ్ తన కొత్త ఇన్నింగ్స్ పట్ల ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ‘వార్ డాగ్’ బైక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. చాలా కాలం తర్వాత మనోజ్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తుండటంతో అటు అభిమానుల్లో, ఇటు సినీ వర్గాల్లో ‘డేవిడ్ రెడ్డి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.









