గత జూన్ 15న కేదార్నాథ్ సమీపంలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్ సహా ఏడుగురు దుర్మరణం చెందారు. ఆర్యన్ ఏవియేషన్కు చెందిన బెల్ 407 హెలికాప్టర్ (VT-BKA) గౌరీకుండ్ వద్ద పర్వతాన్ని ఢీకొని కుప్పకూలింది. ప్రమాదానికి ముందు పైలట్, రిటైర్డ్ ఆర్మీ ఏవియేటర్ కెప్టెన్ రాజ్వీర్ సింగ్ చౌహాన్ పంపిన చివరి రేడియో సందేశం: “ముందు ఏమీ కనిపించడం లేదు.. వెనక్కి తిరుగుతున్నాను”. ఈ విషాదకర వాస్తవాలను ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) తన మధ్యంతర నివేదికలో వెల్లడించింది.
ప్రమాదానికి ప్రధాన కారణం వాతావరణ సమాచార లోపమేనని ఏఏఐబీ నివేదిక స్పష్టం చేసింది. హెలికాప్టర్ ఉదయం గుప్తకాశీ నుంచి కేదార్నాథ్కు వెళ్లి, ఆరుగురు యాత్రికులతో తిరుగు ప్రయాణమైంది. లోయ నుంచి బయటకు వస్తుండగా, దట్టమైన మేఘాలు అడ్డుకోవడంతో పైలట్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. ఆ సమయంలో ప్రమాదానికి గురైన హెలికాప్టర్ వెనుకే వస్తున్న మరో రెండు హెలికాప్టర్ల పైలట్లు అప్రమత్తమై, తక్కువ ఎత్తులో ప్రయాణించి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో మార్గాన్ని మేఘాలు పూర్తిగా కమ్మేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో కూడా నమోదైంది.
కేదార్నాథ్ హెలిప్యాడ్ వద్ద ఆటోమేటెడ్ వెదర్ ఇన్స్ట్రుమెంట్ ఉన్నప్పటికీ, అది మేఘాల కదలికల సమాచారాన్ని అందించదని, కేవలం సీసీటీవీ కెమెరాల ద్వారానే పైలట్లు వాతావరణాన్ని అంచనా వేయాల్సి వస్తుందని నివేదిక పేర్కొంది. ఈ ప్రమాదం తర్వాత, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) మేల్కొని, కేదార్నాథ్ షటిల్ సర్వీసులకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిలో వాతావరణ పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో పాటు, వాతావరణ శాఖ (IMD) సిబ్బందిని తప్పనిసరి చేయడం వంటి చర్యలు ఉన్నాయి.









