UPDATES  

NEWS

 కలెక్టరేట్‌లో కలకలం.. రూ.20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన అధికారిణి..

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలనకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో ఒక మహిళా అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. జిల్లా మత్స్యశాఖ అధికారిణి (డీఎఫ్‌ఓ)గా పనిచేస్తున్న ఎం. చరితారెడ్డి రూ.20,000 లంచం స్వీకరిస్తుండగా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

 

ఒక వ్యక్తి తన మత్స్యకార సహకార సంఘంలో కొత్త సభ్యులను చేర్చుకునేందుకు అనుమతి కోసం డీఎఫ్‌ఓ చరితారెడ్డిని సంప్రదించారు. అయితే, ఆ పనిచేయడానికి ఆమె రూ.20,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

 

ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. బాధితుడు గురువారం కలెక్టరేట్‌లోని కార్యాలయంలో చరితారెడ్డికి రూ.20,000 నగదు ఇస్తుండగా, అక్కడే మాటువేసిన అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యాలయంలోనే అధికారిణి పట్టుబడటంతో కలెక్టరేట్‌లో ఈ సంఘటన కలకలం రేపింది.

 

లంచం అడిగితే సంప్రదించండి: ఏసీబీ

 

ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగితే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేసి లేదా వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలాగే, ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా తమను సంప్రదించవచ్చని అధికారులు వివరించారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |