UPDATES  

NEWS

 ఏపీలో గిరిజనులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త..! ఇక పెద్ద సిలిండర్లు పంపిణీ..

ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ‘దీపం-2’ పథకం కింద ఇప్పటివరకు 5 కిలోల ఎల్‌పీజీ సిలిండర్లను వినియోగిస్తున్న అర్హులైన లబ్ధిదారులకు, ఇకపై 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్లను అందించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ నిర్ణయంతో పాటు, వారికి ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందించే ప్రయోజనం కూడా వర్తించనుంది.

 

గురువారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం, వినియోగదారుల వ్యవహారాలు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు, తమకు కూడా 14.2 కిలోల సిలిండర్లతో పాటు మూడు ఉచిత సిలిండర్ల పథకాన్ని వర్తింపజేయాలని స్థానిక గిరిజనులు విజ్ఞప్తి చేశారని ఆయన గుర్తుచేశారు. వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, ఇచ్చిన మాట ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారని మనోహర్ తెలిపారు.

 

సమస్యకు పరిష్కారం, వేలాది కుటుంబాలకు ప్రయోజనం

 

గతంలో, కొండ ప్రాంతాల్లో రవాణా సౌలభ్యం కోసం 2017లో 5 కిలోల సిలిండర్లను ప్రవేశపెట్టారు. అయితే, ఈ చిన్న సిలిండర్లు వినియోగిస్తున్న కుటుంబాలకు, 14.2 కిలోల సిలిండర్ల లబ్ధిదారులతో సమానంగా సబ్సిడీ ప్రయోజనాలు అందలేదు. ఈ వ్యత్యాసాన్ని తొలగించి, గిరిజనులకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మార్పుకు శ్రీకారం చుట్టింది.

 

ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 16 జిల్లాల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న సుమారు 23,912 గిరిజన కుటుంబాలు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందనున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, ఏలూరు, నంద్యాల, శ్రీకాకుళం, తిరుపతి వంటి జిల్లాల్లోని లబ్ధిదారులు ఈ పథకం కిందకు వస్తారు. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వంపై ఏటా సుమారు రూ. 5.54 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని అంచనా వేశారు.

 

పథకం నేపథ్యం, లక్ష్యాలు

 

గ్రామీణ, పట్టణ పేద మహిళలకు పొగ నుంచి విముక్తి కల్పించే లక్ష్యంతో 1999లో ‘దీపం’ పథకాన్ని ప్రారంభించారు. కట్టెల పొయ్యిపై ఆధారపడటాన్ని తగ్గించడం, వారి ఆరోగ్యాన్ని కాపాడటం, పర్యావరణ అనుకూల ఇంధనాన్ని ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. తాజా నిర్ణయంతో గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా, వారి ఆర్థిక భారాన్ని కూడా తగ్గించినట్లవుతుంది. ఈ పథకం అమలుకు సంబంధించి హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్), ఇండియన్ ఆయిల్ (ఐఓసీఎల్), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) వంటి చమురు సంస్థలతో పాటు జిల్లా కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |