UPDATES  

NEWS

 అమెరికాకు లొంగే ప్రసక్తే లేదు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టీకరణ..

అమెరికాతో వాణిజ్య ఒప్పందాల విషయంలో ఎలాంటి గడువులకు కట్టుబడి ఉండబోమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఇరుదేశాలకు సమానంగా ప్రయోజనం చేకూరే ఒప్పందాలకు మాత్రమే తాము సిద్ధంగా ఉంటామని ఆయన తేల్చిచెప్పారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో పరిశ్రమ వర్గాలతో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

భారత్, అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు ఈ ఏడాది మార్చిలో ప్రారంభమై ఇప్పటివరకు ఐదు విడతలుగా జరిగాయి. అయితే, కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆరో విడత చర్చలు వాయిదా పడ్డాయి. ఈ ప్రతిష్టంభనకు ప్రధాన కారణం వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలన్న అమెరికా డిమాండే. ఈ డిమాండ్‌కు అంగీకరిస్తే దేశీయ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయనే ఆందోళనతో భారత్ మొదటి నుంచి దీనిని వ్యతిరేకిస్తోంది. ఇది రాజకీయంగా సున్నితమైన అంశం కావడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.

 

మరోవైపు, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని కూడా అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యానే భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతోంది. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై సుంకాలను గణనీయంగా పెంచారు. ఇదిలా ఉండగా, యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని, గణనీయమైన పురోగతి సాధించామని పీయూష్ గోయల్ వెల్లడించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |