ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు షురూ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్ఈసీ నీలం సాహ్నీ వీటికి సంబంధించి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేశారు. రెండు విడతలుగా ఆగస్టు 10, 12న పోలింగ్ జరగనుంది.
ఏపీ వ్యాప్తంగా జెడ్పీటీసీ-2, ఎంపీటీసీ-3, సర్పంచ్-2 స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. జులై 30 నుంచి ఆగస్టు 1 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఆగస్టు 10న సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఆగస్టు 12న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగ్గా, ఆగస్టు 14న ఫలితాలు వెల్లడిస్తారు.
మినీ పోల్ సంగ్రామంలో కుప్పం, పులివెందుల నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో చిన్నపాటి ఎన్నికల వాతావరణం కనిపించడం ఖాయమని అంటున్నారు. దీంతో మినీ సంగ్రామం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కుప్పం నియోజకవర్గంలో మణీంద్రం, గురజాల నియోజకవర్గంలో వేపకంపల్లి, కావలి నియోజకవర్గంలో విడవలూరు-1 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. ప్రకాశం జిల్లా కొండెపి సర్పంచ్, తూర్పు గోదావరి జిల్లా కడియపు లంక సర్పంచ్ స్థానానికి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ ఈసీ.
జులై 30 నుంచి ఆగస్టు 1 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 2న దాఖలైన నామినేషన్లు స్క్రూటిని చేస్తారు. తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్ చేసుకోవడానికి 3 వరకు ఛాన్స్ వుంది.వీటి తర్వాత ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.
వీలైతే సెప్టెంబర్ లేదా అక్టోబరులో నోటిఫికేషన్ రావచ్చని భావిస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. చేసిన పని చెప్పుకోవాలని కూటమి నేతలు, ఏడాదిలో అధికార పార్టీ అమలు చేయని హామీలను ఎత్తిచూపాలని వైసీపీ సిద్ధమవుతోంది.









