ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టైగర్ రిజర్వేషన్ రిజర్వ్ ఏర్పాటులో భాగంగా తీసుకువచ్చిన జీవో నెంబర్ 49ని రద్దు చేయాలని ఆదివాసి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆదివాసులకు నష్టం చేకూర్చేలా జీవో ఉందని బంద్ చేపడుతున్నారు. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా డిపో ప్రధాన గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు.
ఆదివాసీలకు నష్టం చేకూర్చేలా ఉందని నిరసన
ఆదిలాబాద్తో పాటు ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, ఉట్నూర్, జన్నారంతో పాటు బోథ్ ,ఇచ్చోడలో ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అక్కడక్కడ తెరిచిన దుకాణాలను తిరిగి మూసేయించారు. ఉట్నూర్ డిపో ఎదుట ధర్నా చేపట్టడంతో.. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. భారత కమ్యూనిస్టు పార్టీ.. తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. లేఖలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న పులుల సంఖ్యను ప్రస్తావించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న లక్షల మంది ప్రజల జీవితాలను విచ్ఛిన్నం చేయటానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తుందని పేర్కొన్నారు.
మంచిర్యాల దండేపల్లిలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో జీవో 49 ను రద్దుచేయాలని… దండేపల్లి లోని ప్రైవేట్ స్కూల్లు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్లో కూడా ఆదివాసీలు జీవో 49కు వ్యతిరేకంగా మద్దతు తెలిపారు. ఆర్టీసీ బస్సులను నిలిపివేసి బంద్ నిర్వహించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జీవో 49ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్
మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మండల్లాలో కూడా ఆదివాసి హక్కుల పోరాట సమితి బంద్కు పిలుపు నిచ్చింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో జీవో నెంబర్ 49 ద్వారా ఏజెన్సీలో ఉండే ఆదివాసులను వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తుడుం దెబ్బ నాయకులు ఆరోపించారు. జీవో 49 ను రద్దుచేసి, జివో ఏంఎస్ 3ని పునరుద్ధరణ చేయాలని కోరారు. బంద్ నిర్వహించడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయి.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.









