దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోన్న అంశం- డీలిమిటేషన్. 2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల సంఖ్య పెరగవని ఇక్కడి ప్రభుత్వాలు భావిస్తోన్నాయి.
ఏకతాటిపైకి..
ఈ పరిస్థితుల మధ్య- కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా సరికొత్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు స్టాలిన్. దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రావడానికి కృషి చేస్తోన్నారు. ఇందులో భాగంగా దక్షిణాదిన బీజేపీ- మిత్రపక్షాలేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినాయకులతో ఇటీవలే ఓ సమావేశాన్ని నిర్వహించారు.
కొనసాగింపు..
దీనికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఇప్పుడున్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 119 నుంచి 153కు పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రూపొందించిన తీర్మానం అది. రేవంత్ రెడ్డి దీన్ని సభలో ప్రవేశపెట్టారు.
ఎలాంటి సంప్రదింపులు లేకుండా..
రాష్ట్రాలతో ఎలాంటి పారదర్శక సంప్రదింపులు నిర్వహించకుండా..లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని, ఇది ఆందోళనకరమని ఈ తీర్మానం పేర్కొంది. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల అభిప్రాయాన్ని తీసుకోవాలని, రాజకీయ పార్టీలు, హక్కుదారులను సంప్రదించాలని సూచించింది.
జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు
గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అనేక రాష్ట్రాలు జనాభా నియంత్రణ చర్యలను పాటించాయని, వాటిని సమర్థవంతంగా అమలు చేశాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారీ తీర్మానంలో. ఫలితంగా జనాబా నిష్పత్తి పెరుగుదల తగ్గిందని వివరించారు. ఇప్పుడు డీలిమిటేషన్కు జనాభాను ప్రాతిపదికన తీసుకోవడం సమంజసం కాదని అన్నారు.
రాజ్యాంగ సవరణల ఉద్దేశం..
జనాభా పెరుగుదలను స్థిరీకరించాలనే 42, 84, 87వ రాజ్యాంగ సవరణల ఉద్దేశం ఇంకా నెరవేరలేదని రేవంత్ రెడ్డి ఈ తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు. దీన్ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్నియూనిట్గా..
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంలో రాష్ట్రాన్ని ఓ యూనిట్గా తీసుకోవాలని రేవంత్ రెడ్డి కేంద్రానికి సూచించారు. తాజాగా జనాభా లెక్కలను సేకరించిన తరువాత, వాటి ఆధారంగా- లోక్సభ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేయాలని, వాటి సరిహద్దులను నిర్ధారించాలని చెప్పారు.
ఏపీ పునర్విభజన చట్టం..
ఏపీ పునర్విభజన చట్టం 2014, తాజా జనాభా గణాంకాల ఆధారంగా- తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సీట్ల సంఖ్యను తక్షణమే 119 నుంచి 153కు పెంచాలని తీర్మానంలో రేవంత్ రెడ్డి పొందుపరిచారు. దీనికి సంబంధించినంత వరకు వెంటనే రాజ్యాంగ సవరణ చేపట్టాలని కోరారు.