UPDATES  

NEWS

 వైఎస్ఆర్ పేరు విషయంలో ఏపీ కేబినెట్ రెండు కీలక నిర్ణయాలు..

వైఎస్ఆర్ పేరు విషయంలో ఏపీ కేబినెట్ రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒక చోట పూర్తిగా వైఎస్ఆర్ అనే పేరుని తొలగించగా, మరో చోట వైఎస్ఆర్ పేరుకున్న ప్రాధాన్యత కాస్త తగ్గించేలా కేబినెట్ నిర్ణయం ఉంది. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాల్టీ పేరులో వైఎస్ఆర్ పేరుని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఇకపై తాడిగడప మున్సిపాల్టీ అనే పేరు మాత్రమే ఉంటుంది. అందులో వైఎస్ఆర్ అనే అక్షరాలు కనిపించవు. ఇక రెండో విషయం కూడా వైఎస్ఆర్ అనే పేరుతో ముడిపడి ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కడప జిల్లాకు ఆయన పేరు పెట్టాలనే ప్రతిపాదన వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని పూర్తి చేసింది. వైఎస్ఆర్ కడపగా కడప జిల్లా పేరు మార్చింది. తదనంతర కారంలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయిన తర్వాత కడప పేరుని జిల్లానుంచి తొలగించారు. కేవలం వైఎస్ఆర్ పేరుని మాత్రమే ఉంచారు.

 

గతంలో నెల్లూరు జిల్లాను కూడా శ్రీ పొట్టి శ్రీరాములు పేరుపై పిలిచేవారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మార్చారు. అయితే నెల్లూరు అనే పదాన్ని మాత్రం తొలగించలేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా రాజ్యాంగ నిర్మాత పేరుతోపాటు కోనసీమ అనే పదం ఉంటుంది. ఇక ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా కొత్తగా ఏర్పాటైంది కాబట్టి.. పాత జిల్లా పేరుని మార్చే, లేదా తొలగించే అవకాశం అక్కడ లేదు. కానీ కడప జిల్లా విషయంలో మాత్రం ఆ పేరుని పూర్తిగా మార్చేయడం, కడప అనే పేరు తొలగించి వైఎస్ఆర్ జిల్లా అని మాత్రమే పిలవడాన్ని కొంతమంది ఆక్షేపిస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కడప పేరుని కూడా కొనసాగించేలా, వైఎస్ఆర్ పేరుని పూర్తిగా తొలగించకుండా నిర్ణయం తీసుకుంది. ఇకపై వైఎస్ఆర్ కడప జిల్లా అనే పేరు వినపడుతుందనమాట.

 

ఇటీవల తెలంగాణలో కూడా ఇలాంటి పేరు మార్పు వ్యవహారం సంచలనంగా మారింది. తెలుగు యూనివర్శిటీ పేరు మారుస్తూ ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ అనే పేరు స్థానంలో సురవరం ప్రతాప్ రెడ్డి పేరుని చేర్చబోతున్నారు. దీనిపై బీజేపీ రగడ చేయగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరైన వివరణ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే పేరుతో తెలుగు యూనివర్శిటీ ఉండటం సరికాదని, అందుకే పేరు మార్పు అని చెప్పారు. ఇక్కడ పొట్టి శ్రీరాములుని కించపరిచే ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఆయన వివరించారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు ఆయన పేరుని పెడతామన్నారు. ఈమేరకు కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

 

పేరు మార్పు వ్యవహారాలను పక్కనపెడితే.. ఏపీ కేబినెట్ తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇచ్చే అంశం. రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా పవర్ లూమ్స్ నడిపే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తారు. ఆపై వాడకానికి మాత్రమే బిల్లులు వసూలు చేస్తారు. దీనితోపాటు ఉపాధ్యాయ బదిలీలపై కూడా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ సవరణ చట్టానికి సంబంధించిన బిల్లుపై ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక ఏపీ రాజధాని అమరావతిలో భూకేటాయింపులను కూడా కేబినెట్ ఆమోదించింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇటీవల రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా ఏపీ కేబినెట్ ఆమోదించింది.

 

రాజధాని అమరావతికి సంబంధించి సీఆర్డీఏ అధారిటీ ఆమోదించిన టెండర్ల పనులకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 22 అంశా లకు సంబంధించి 22వేల 607 కోట్ల రూపాయల విలువైన పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పెట్టుబడులకు, విశాఖ నగరంలో లులు గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ పెట్టుబడులకు, శ్రీ సిటీలో 25వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన కీలక నిర్ణయాలు కూడా ఏపీ కేబినెట్ తీసుకుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |