UPDATES  

NEWS

 తెలంగాణకు పెట్టుబడుల జాతర..

దావోస్‌ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో బృందం వివిధ కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, హెచ్సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ విజయకుమార్‌తో చర్చలు జరిపారు.

 

హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్‌ను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది హెచ్‌సీఎల్ కంపెనీ. లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సేవలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. అత్యాధునిక క్లౌడ్, అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సొల్యూషన్‌లను అందించనుంది.

 

హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సీఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటవుతుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేషన్‌ అందుకుంది కూడా. దీని ద్వారా దాదాపు 5,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయి.

 

ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతోపాటు, ఐటీలో ప్రతిభావంతులైన నిపుణులతో హెచ్సీఎల్ గ్లోబల్ నెట్‌వర్క్ సెంటర్‌ హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కొత్త సెంటర్ మరింత అత్యాధునిక సామర్థ్యాన్ని అందుబాటులోకి తెస్తుందని హెచ్సీఎల్ టెక్ సీఈవో విజయకుమార్ అభిప్రాయపడ్డారు.

 

రాష్ట్రంలో తమ కంపెనీ సేవల విస్తరణను సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతించారు. ప్రపంచంలో ఐటీ హబ్‌గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుందని అభిప్రాయ పడ్డారు. వచ్చే నెలలో కొత్త సెంటర్‌ను ప్రారంభించాలని ఆహ్వానించారు.

 

స్థానిక యువతకు ఉద్యోగాలతోపాటు హైదరాబాద్‌లో టెక్నాలజీ, ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలని హెచ్సీఎల్ టెక్ ప్రతినిధులను ఆయన కోరారు.

 

ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామమన్నారు. 2007 నుంచే హెచ్సీఎల్ హైదరాబాద్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా తమ క్లయింట్లకు సేవలను అందిస్తోంది. కొత్త సెంటర్‌తో హైదరాబాద్‌లో హెచ్సీఎల్ మొత్తం అయిదు సెంటర్లను విస్తరించనుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |