మీకు భూమి ఉందా.. అయితే మీకోసం ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కూటమి ప్రభుత్వం రాగానే, భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపిందని చెప్పవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్న ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి. అయితే అసలు భూ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం రాగానే, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో ఆ యాక్ట్ అపోహలు ఉన్నా, లేకున్నా రైతులకు మాత్రం ఊరట లభించింది. అంతేకాదు భూ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఆయన దృష్టికి వచ్చింది. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు కూడ వినతులు అదే రీతిలో అందాయి. ఇలా భూ సమస్యలు అధికంగా ఉన్నాయని గ్రహించిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వెంటనే రెవెన్యూ సదస్సులను వాడవాడలా నిర్వహిస్తోంది. ఈ సదస్సులలో సీఎం చంద్రబాబు సైతం పాల్గొన్నారు.
అయితే సదస్సులకు పెద్ద ఎత్తున వినతులు వస్తుండగా, ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 20 తేదీ నుండి రీ సర్వేను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా ఈసారి చాలా పకడ్బందీగా రీ సర్వే నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి మండలంలో గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని రీసర్వే చేస్తామని, ఇందులో అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొనాలని కూడ పిలుపునిచ్చింది.
ఎలాంటి హడావిడి లేకుండా ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వకుండా రోజుకు 20 ఎకరాలు మాత్రమే ఒక టీమ్ రీ సర్వే చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. రీ సర్వే జరిపిన గ్రామాల్లో సభలు నిర్వహిస్తే ఒక లక్షా 80 వేల ఫిర్యాదులు వచ్చాయట. ఆ ఫిర్యాదులను పరిష్కరించి వారికి కొత్త పాస్ పుస్తకాలను ప్రభుత్వం త్వరలోనే అందజేయనుంది. మిగిలిన వారికి సంక్రాంతి పండుగ తర్వాత కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు. అయితే ఈ పాస్ పుస్తకంపై రాజముద్రతోపాటు క్యూఆర్ కోడ్ ఉంటుందని ఇటీవల మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అంటే భూమి గల ప్రతి ఒక్కరికీ నూతన పాస్ పుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్దమవుతుందని చెప్పవచ్చు. ఇదే జరిగితే భూ సమస్యలకు కాస్తైనా ఫుల్ స్టాప్ పెట్టినట్లేనని ప్రభుత్వం భావిస్తోంది.