తాము ఆ తప్పు చేయలేదని, అనవసరంగా మాపై చేస్తున్న అబద్దపు ప్రచారాలను నమ్మవద్దని దివ్వెల మాధురి అన్నారు. నిన్న తిరుమలకు వెళ్లిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు ఫోటో షూట్ జరిపినట్లు, అలాగే మాడవీధుల్లో రీల్స్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిపై వారివురు స్పందించి సోషల్ మీడియా ద్వార వీడియో విడుదల చేశారు.
టెక్కలికి చెందిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి అంటే తెలియని వారు ఉండరు. ఇక పొలిటికల్ లీడర్ గా దువ్వాడకు ఎంత గుర్తింపు ఉందో.. అదే గుర్తింపు సోషల్ మీడియాలో మాధురికి ఉంది. ఇక ఎమ్మెల్సీ శ్రీనివాస్ కుటుంబ వివాద సమయంలో మాధురి తెరపైకి వచ్చారు. అయితే ఒకరికి ఒకరు తోడుగా మాత్రమే ఉంటున్నామని, తమ మధ్య ఉన్న బంధాన్ని చెడుగా అనుకోవద్దు అంటూ పలుమార్లు మీడియాతో మాధురి అన్నారు.
అయితే దువ్వాడ వివాదం సమయంలో మాధురి అండదండగా ఉన్నారు. దీనితో వీరి మధ్య రిలేషన్ షిప్ పై సోషల్ మీడియా కోడై కూసింది. ఏదిఏమైనా వీరివురు న్యాయపరమైన చిక్కులు వీడిన అనంతరం ఒక్కటవుతారని అందరూ భావించారు. ఇటీవల దువ్వాడకు సంబంధించిన కుటుంబ వివాదం కొంత సద్దుమణిగిన స్థితిలో.. మాధురి సోషల్ మీడియాలో స్పీడ్ అయ్యారనే చెప్పవచ్చు. ఈమెకు సోషల్ మీడియా పరంగా యూత్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అందుకే ఈమెకు సంబంధించిన ప్రతి వీడియో వైరల్ కావాల్సిందే.
కాగా నిన్న తిరుమల బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు దువ్వాడ, దివ్వెల తిరుమలకు వెళ్లారు. అక్కడ స్వామి వారిని దర్శించుకొని కొద్దిసేపు మీడియాతో కూడా మాట్లాడారు. మాధురి మాట్లాడుతూ.. కోర్టులో తమకు గల న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే.. తాము పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు. అలాగే శ్రీనివాస్ కూడా తాము రెండేళ్లుగా కలిసి ఉంటున్నట్లు, తనకు కలియుగ దైవం తిరుమలేశుని బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అందుకే తిరుమలకు వచ్చినట్లు తెలిపారు.
ఇంత వరకు ఓకే కానీ.. వీరు మాడవీధుల్లో రీల్స్ చేసినట్లు, అలాగే ఫోటో షూట్ తిరుమల పరిసరాల్లో జరుపుకున్నట్లు వార్తలు హల్ చల్ చేశాయి. వీటిపై వీరివురు స్పందించి అసలు విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వీడియో రిలీజ్ చేసి చెప్పేశారు. తాము ఎటువంటి రీల్స్ చేయలేదని, అలాగే ఫోటో షూట్ కూడా జరుపుకోలేదని వివరణ ఇచ్చారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి అంటే తమకు అపారమైన భక్తి అంటూ.. తమపై వస్తున్న నిరాధార ఆరోపణలను నమ్మవద్దని సూచించారు.