తిరుమల లడ్డూ వివాదం దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లడ్డూ వివాదం పై విచారణ పైన నేడు సుప్రీం కోర్టులో కేంద్రం తమ అభిప్రాయం స్పష్టం చేసింది. సిట్ ఈ కేసు తేల్చలేదని..కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు నివేదించారు. కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. దీంతో, సుప్రీం కోర్టు సీబీఐ, ఏపీ ప్రభుత్వంతో సహా అయిదుగురుతో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయించింది.
సుప్రీంలో విచారణ
తిరుమల లడ్డూ వ్యవహారంలో కేంద్రం వైఖరి పైన సుప్రీంకోర్టు అభిప్రాయం కోరింది. ఈ రోజున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలియచేస్తామని చెప్పారు. ఈ రోజు ఈ కేసు విచారణకు రాగానే పిటీషనర్ సుబ్రమణ్య స్వామి స్వయంగా తన వాదనలు వినిపించారు. మరో పిటీషనర్ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబల్ వాదించారు. ప్రభుత్వం తరపున సిద్దార్ధ లూథ్రా, ముఖుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారం కోట్లాది మంది భక్తులకు సంబంధించిదని..రాజకీయాలు సరి కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు.
కేంద్ర అభిప్రాయం
జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. లడ్డూ ఆరోపణలు నిజమైతే ఆమోదించదగినవి కాదని మెహతా వ్యాఖ్యానించారు. జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. స్వతంత్ర దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరుతో ఈ సంస్థ విచారణ చేసేలా ప్రతిపాదించారు. ఈ వ్యవహారం పైన రాజకీయంగా ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని నిర్దేశించారు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ కమిటీ విచారణ చేయనుంది.
ప్రత్యేక కమిటీ
ఈ విచారణ కమిటీలో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు.. ఏపీ పోలీసుల నుంచి ఇద్దరు పోలీసు అధికారులతో పాటుగా ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉంటారు. ఆరోపణల పైన నిష్పక్ష పాతంగా విచారణ జరగాలని కోరుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో, ఈ కమిటీ పూర్తి స్థాయిలో ఏర్పాటైన తరువాత తిరుమల లడ్డూ వ్యవహారం పైన విచారణ ప్రారంభం కానుంది.