ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై నటి కాదంబరీ జెత్వానీ వేధింపుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కాదంబరిని వేధించిన వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరిని అరెస్టు చేసి విచారిస్తే అప్పట్లో ఎవరి ఆదేశాలతో ఇదంతా జరిగిందో తేల్చేందుకు సర్కార్ సిద్దమవుతున్న వేళ ఇందులో ఓ ఐపీఎస్ అధికారి అప్రూవర్ గా మారేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
కాదంబరీ జెత్వానీపై వేధింపుల వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ ఛీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు తన కింది స్ధాయి ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ, ఇతర సిబ్బంది సాయంతో మౌఖిక ఆదేశాలతోనే వేధింపుల ప్రక్రియ పూర్తి చేశారు. దీనిపై విచారణ జరుపుతున్న ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ .. తాజాగా ఇందులో ఒకరైన విశాల్ గున్నీ వాంగ్మూలం సేకరించింది. రాతపూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలంలో విశాల్ గున్నీ సంచలన విషయాలు బయటపెట్టారు.
అప్పటి ఇంటెల్ ఛీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు తమతో ఈ కుట్రను ఎలా అమలు చేయించారన్నది పూస గుచ్చినట్లు తాజా విచారణలో పోలీసులకు వివరించారు. ఈ మేరకు ఆయన నుంచి రాతపూర్వక వాంగ్మూలం తీసుకున్నారు. ఇందులో విశాల్ గున్నీ అసలు కాదంబరీ కేసులో అప్పటి సీఎంవోలో కుట్ర ఎలా మొదలైందో, పీఎస్సార్ ఇచ్చిన ఆదేశాలు ఏంటి, వాటిని తాము ఎలా అమలు చేశామో వివరించారు. దీంతో ఇప్పుడు ఈ మొత్తం కేసులో విశాల్ గున్నీ వాంగ్మూలం కీలకంగా మారిపోయింది.
విశాల్ గున్నీ అప్రూవర్ గా మారితే కాపాడతామని ప్రస్తుత ప్రభుత్వ పెద్దల నుంచి లభించిన హామీ దీని వెనుక ఉండొచ్చని భావిస్తున్నారు.ఇదే నిజమైతే త్వరలో ఆయన అప్రూవర్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కేసును చాలా సులువుగా ఫ్రేమ్ చేయొచ్చనేది పోలీసుల ఆలోచనగా కనిపిస్తోంది.









