UPDATES  

NEWS

 జగన్ ప్రతిష్ఠాత్మక పథకానికి కూటమి ప్రభుత్వం బ్రేక్…!

ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. జగన్ ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తోంది. మరి కొన్ని పథకాల కొనసాగింపుపైన తర్జన భర్జన పడుతోంది. ఆర్దికంగా పడే భారం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇంటింటికి రేషన్ పథకం కొనసాగిస్తారా లేదా అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకం పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

 

ప్రభుత్వం కసరత్తు వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ ఇంటింటికి రేషన్ సరఫరా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా వాహనాలు కొనుగోలు చేసారు. రేషన్ సరుకులను లబ్దిదారుల ఇంటి ముందుకు చేర్చేలా ఈ పథకం అమలు చేసారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా దాదాపుగా రూ 1800 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వాహనాల వినియోగం పైన పలు ఆరోపణలు ఉన్నాయి. తమ పార్టీ వారికే లబ్ది చేకూరేలా ప్రభుత్వ ఖర్చుతో వాహనాలు కొనుగోలు చేయించి వారితో సరఫరా చేయించారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

 

కొనసాగించాలా లేదా ఈ పథకం అమలు పైన తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. ఈ పథకం కొనసాగింపు పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి కొనసాగిస్తున్నా…భవిష్యత్ లో ఏం చేయాలనే దాని పైన ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయకుండా గిరిజనులు ఉండే ప్రాంతాలకు, రాకపోకలు సవ్యంగా లేని ప్రదేశాలకు ఈ తరహా రేషన్ పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని పైన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సమీక్షలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

 

త్వరలో నిర్ణయం ఇకపై రేషన్ వస్తువులు తీసుకోవాలని భావించే వారు తప్పనిసరిగా పాత పద్ధతిలోన రేషన్ షాపులకు వచ్చి సరుకులు తీసుకొనేలా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత రేషన్ డీలర్లు సైతం ఇదే అంశం పై మంత్రులతో చర్చించారు. రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ తిరిగి ప్రారంభించాలని కోరారు. అయితే, ఈ పథకం లో తీసుకొనే నిర్ణయాల పైన ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందనేది ప్రస్తుతం ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. త్వరలోనే ఈ పథకం పైన అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |