UPDATES  

NEWS

 కేంద్ర బడ్జెట్ పై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు..!

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూలు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు వరాలు ప్రకటించింది. ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరిపింది. కానీ, కొన్ని రాష్ట్రాల ఊసే లేదని రాజకీయ విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర బడ్జెట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో ఇచ్చారని అనుకుంటున్నారని, బడ్జెట్‌లో ఏపీకి ఇచ్చింది ఏమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నవే ఇచ్చారని వివరించారు.

 

అమరావతి, పోలవరం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి అన్ని విభజన చట్టంలోనే ఉన్నాయని, ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, దానికి బదులు క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌కు సహాయం చేస్తామని చెప్పారని చంద్రబాబు తెలిపారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తలసరి ఆదాయం 30 వేల తేడా ఉన్నదని, గడిచిన ఐదేళ్లలో విభజన కంటే ఎక్కువ అధ్వాన్నమైన పరిస్థితికి ఏపీ పడిపోయిందన్నారు. తలసరి ఆదాయం తగ్గిపోయిందని, పోలవరం, అమరావతి నాశనం అయిపోయాయని పేర్కొన్నారు.

 

రాష్ట్ర విభజన వల్ల అన్యాయం జరిగింది కాబట్టే ఏపీ పునర్నిర్మాణం కోసం సహాయం అడుగుతున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి నష్టం జరగడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని, జగన్ ఐదేళ్ల పాలన చూసి ప్రజలు ఎన్డీయేకు చారిత్రాత్మక విజయాన్ని అందించారని వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలనే అడుగుతున్నామని, కొత్తగా ఇచ్చిందేమీ లేదని ఆయన తెలిపారు. కానీ, వాటిని కావాలని రాజకీయం చేయడం సరికాదని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్, జల జీవన్ మిషన్‌లో గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం వెనుకబడి ఉన్నదని, కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లించారని గత ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.

 

కేంద్ర బడ్జెట్‌లో మిత్ర పక్షాల రాష్ట్రాలకు మాత్రమే దండిగా కేటాయింపులు జరిపారని, విపక్ష రాష్ట్రాలకు మొండి చేయి చూపించారని విమర్శలు వస్తున్నాయి. ఇందుకు నిరసనగా పలు విపక్ష రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఈ రోజు నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేశాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |