బడ్జెట్ కేటాయింపుల్లో ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయిస్తూ.. ఎన్డీయేలో భాగం కాని రాష్ట్రాలకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ.. పార్లమెంటు బయట బుధవారం అన్ని ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేశాయి. రాజ్యసభలో కూడా బడ్జెట్ లో రాష్ట్రాలకు వివక్ష జరిగిదంటూ ప్రతిపక్ష నాయకులు వాకవుట్ చేశారు.
బడ్జెట్ కు వ్యతిరేకంగా డిబేట్ చేయాలని ఇండియా బ్లాక్ కూటమి నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ప్రతిపక్ష నాయకులంతా తమ రాష్ట్రాల సమస్యలపై చర్చించాలని, బడ్జెట్ లో తమ రాష్ట్రాల పట్ల వివక్ష జరిగిందని వారి వాదన. ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య రాష్ట్రాలకు అన్ని వనరులు కేటాయించి.. ఎన్డీయేలో భాగం కాని రాష్ట్రాలను నిర్లక్ష్యం చేశారని వారంతా విమర్శలు చేశారు.
అయితే బడ్జెట్ లో కేటాయింపులపై 20 గంటల పాటు చర్చ జరిపేందుకు లోక్ సభ అడ్వైజరీ కమిటీ అంగీకరించింది. బడ్జెట్ లో ముఖ్యంగా రైల్వే, విద్య, వైద్యం, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అంశాలపై చర్చ జరిపేందుకు అనుమతి ఇచ్చింది. అయితే చర్చ మధ్యలో క్వశ్చన్ హార్ సమయంలో ప్రతిపక్ష పార్టీ ఎంపీలు బడ్జెట్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. సజావుగా సాగుతున్న సభను అడ్డుకున్నారు. ఆ తరువాత వారంతా లోక్ సభ నుంచి బయటికెళ్లి పార్లమెంటు భవనం బయట నిరసనలు చేయడం మొదలుపెట్టారు.
మరోవైపు రాజ్యసభలో బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల నిరసనలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. సీతారామన్ మాట్లాడుతూ.. ”బడ్జెట్ లో దేశంలోని అన్ని రాష్ట్రాల గురించి ప్రస్తావించడం సాధ్యం కాదని అన్నారు. బడ్జెట్ లో తీసుకున్న నిర్ణయాలు బాగా ఆలోచించిన తరువాతే అందరిముందు ప్రకటించామని ఆమె అన్నారు. బడ్జెట్ లో వాడవాన్ పోర్టు నిర్మిస్తామని ప్రకటించాం.. కానీ మహారాష్ట్ర పేరు ప్రస్తావించలేదు.. అంతమాత్రాన మహారాష్ట్రను నిర్లక్ష్యం చేసినట్లా?.. అలాగే ఒక రాష్ట్రం పేరు ప్రస్తావిచినంత మాత్రాన .. అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు ఆ రాష్ట్రానికే కేటాయించినట్లా?.. ఇది అర్థం లేని వాదన.. ఇదంతా ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు కేంద్రం ఏదో అన్యాయం చేసిందనే భ్రమను కలిగించడానికే ఈ నిరసనలు చేస్తున్నాయి,” అని అన్నారు.
నిర్మలా సీతారామన్ మాట్లాడుతుండగానే ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజ్యసభ నుంచి వాకవుట్ చేశాయి. పార్లమెంటు బయట లోక్ సభ ఎంపీలు చేస్తున్న నిరసనలో రాజ్యసభ ఎంపీలు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా నిరసన జరుగుతుండగా అక్కడికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు శశి థరూర్, రన్ దీప్ సింగ్ సుర్జీవాలా చేరుకున్నారు.