ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైందని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకురావడంతో చాలా సమస్యలకు దోహదం చేసిందన్నారు. ముఖ్యంగా భూ యజమానులకు చాలా సమస్యలు వచ్చాయన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తే న్యాయవాదులు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టారన్నారు. భూమి అనేది తరతరాలుగా వారసత్వం నుంచి వస్తుందన్నారు.
ప్రభుత్వం ముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కానీ సీఎం ఫొటో వేసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తారా అని ప్రశ్నించారు. ఇటీవల భూ సర్వే అన్నారని, ఎక్కడికక్కడ వివాదాలు పెంచేశారన్నారు. ఈ చట్టం వచ్చి ఉంటే పౌరుల ఆస్తి హక్కును మింగేసే పరిస్థితి తలెత్తేదని సీఎం వ్యాఖ్యానించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లులును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చర్చను ప్రారంభించారు. అనంతరం రెండు బిల్లులు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు.