పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి మొదలు కానున్నాయి. ఈసారి సమావేశాలు వాడివేడీగా జరిగే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా నీట్, యూపీఎస్సీ, కన్వర్ యాత్రపై చర్చ జరగనుంది.
ఇందుకోసం అధికార – విపక్షాలు తమతమ అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. కాకపోతే అధికార బీజేపీ హిస్టరీని బయటపెట్టాలని చూస్తోంది. ఇండియా కూటమి మాత్రం నీట్, యూపీఎస్పీ అంశాలను టార్గెట్గా పెట్టుకుంది. ఉభయసభల్లో ఆర్థికసర్వేను ప్రవేశ పెట్టనున్నారు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్.
ఈ సమావేశాలు ఆగష్టు 12వరకు జరుగుతాయి. మంగళవారం పూర్తి స్థాయి బడ్జెట్ను కేంద్రం ప్రవేశ పెట్ట నుంది. అయితే ప్రభుత్వం కీలకమైన ఆరు బిల్లులు తీసుకురానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ పదవి ఎన్నికల జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ పదవిని విపక్షాలకు ఇవ్వాలని అఖిలపక్షం సమావేశంలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నిక జరిగే అవకాశాలున్నట్లు ఢిల్లీ సమాచారం.
కొత్త బిల్లులను ఆమోదించుకునేందుకు అధికార పార్టీకి బలం తగ్గింది. దీంతో విపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. మాజీ న్యాయమూర్తులు రాజకీయాల్లోకి రావడం, డీప్ ఫేక్, పౌరసత్వ సవరణ వంటి చట్టాలపై దాదాపు 23 బిల్లులను రాజ్యసభలో అధికార పక్షం పెట్టనుంది. విపక్షాల ఎక్కుపెట్టే అస్త్రాలను అధికార ఎన్డీయే కూటమి ఏ విధంగా అడ్డుకుంటుందో చూడాలి.