ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రతీ నిమిషం అలర్ట్ గా ఉండాలని సూచించాయి. ఇటీవల కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావన వచ్చిందని తెలిపాయి. పవన్ ను ఆ గ్రూపులు టార్గెట్ చేశాయా? ఇంతకీ ఎవరికి ఈ గ్రూపులు ? అనే విషయం ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నాయి.
కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు కాల్స్ ట్రాకింగ్ చేసినప్పడు కొన్ని గ్రూపుల్లో పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావన వచ్చిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర జరగవచ్చనే అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే, ఆయన తన సెక్యూరిటీని పెంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని నిఘా వర్గాలు సూచించాయి.
కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో పవన్ కల్యాణ్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కాగా, ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కేంద్రంలో ప్రధాని మోదీతో పవన్ సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే జనసేన పార్టీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. వీటిలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. నిత్యం రాజకీయాలు, సినిమాలతో బిజీబిజీగా గడిపిన ఏపీ డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ కాస్త విరామం తీసుకున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ తన సతీమణి అన్నా లెజినోవా మాస్టర్స్ పట్టా స్వీకరణ కోసం సింగపూర్ వెళ్లారు. ఇందులో భాగంగా అన్నా లెజినోవా పట్టా పొందిన తర్వాత పవన్ కల్యాణ్ ఆమెతో సెల్ఫీ దిగారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.