ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలోని తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి రావడానికి దోహదం చేసిన సూపర్ 6 పథకాల్లో ఒకటి- రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలన్నర రోజులు గడిచిపోయాయి. అయినప్పటికీ- ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు కావట్లేదు. ఆ మాటకొస్తే ఇప్పటివరకు ఈ సూపర్ 6లో అమలు చేసిన హామీ ఒక్కటే ఒక్కటి. అది- సామాజిక భద్రత కింద పింఛన్ల పెంపు మొత్తం.
గతంలో 3,000 రూపాయలు ఉన్న ఆ పింఛన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచింది చంద్రబాబు- పవన్ కల్యాణ్ సర్కార్. ఈ నెల 1వ తేదీన దీన్ని అమలు చేసింది. ఇక మిగిలిన హామీలు గానీ, చేసిన సంతకాలకు గానీ ఇప్పటివరకు ఎలాంటి గ్యారంటీ లేకుండాపోయింది.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటివరకు విడుదల కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడానికి ఉద్దేశించిన మహాశక్తి పథకం అమలు ఊసే లేదు. మహిళలకు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ మాటే ఎత్తట్లేదు. ఉచిత ఇసుక అంటూ ప్రకటించినప్పటికీ.. టన్నుకు 1,400 రూపాయల మొత్తాన్ని వసూలు చేస్తోంది ప్రభుత్వం.
అ పరిస్థితుల్లో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ పథకం అమలులోకి తీసుకొస్తామని అన్నారు. దీనితో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అన్నింటినీ అమలు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ఈ ఉదయం ఆయన చంద్రగిరిలో ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులను ప్రారంభించారు. చంద్రగిరి- రేణిగుంట మధ్య ప్రవేశపెటిన నాలుగు బస్ సర్వీసులను పూజా కార్యక్రమాలను నిర్వహించి పచ్చజెండా ఊపారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఆర్టీసీ అధికారులతో చర్చించిన అనంతరం చంద్రగిరి- రేణిగుంట మార్గంలో నాలుగు బస్సులను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన బస్సు నడిపారు.









