తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు రుణమాఫీ అమలు దిశగా మార్గదర్శకాలు ప్రకటించింది. ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. తాజా మంత్రివర్గ సమావేశంలో విధి విధానాలకు ఆమోదం తెలిపారు. ఇక, ఇప్పుడు అమలు మార్గదర్శకాలను విడుదల చేసారు. అర్హతలను ఖరారు చేసారు. రేషన్ కార్డు ప్రామణికంగా నిర్ణయించారు. ప్రతీ కుటుంబానికి రూ 2 లక్షల రుణమాఫీ అమలు అవుతుందని మార్గదర్శకాల్లో స్పస్టం చేసారు.
తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు మార్గదర్శకాలను వెల్లడించింది. 2018 డిసెంబర్ 12 నుంచి..2023 డిసెంబర్ 9 మధ్య కాలంలో తీసుకున్న అన్ని పంట రుణాలను మాఫీకి అర్హతగా నిర్ణయించింది. స్వల్పకాలిక పంటలకు రుణమాఫీ వర్తించనుంది. భూమి ఉన్న ప్రతీ రైతు కుటుంబానికి రూ 2 లక్షలు రుణమాఫీ అమలవుతుందని మార్గదర్శకాల్లో స్పస్టం చేసారు. తెలంగాణలోని అన్ని వాణిజ్య, ప్రాంతీయ, సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న వారికి రుణమాఫీ వర్తిస్తుంది.
రేషన్ కార్డుల ప్రాతిపదికన రైతు కుటుంబాలను ఖరారు చేస్తారు. ఒకే రేషన్ కార్డులో ఉన్న ఇద్దరు రుణం తీసుకుంటే కుటుంబ పెద్దకే రుణమాఫీకి అర్హత ఉంటుంది. రూ 2 లక్షలకు పైగా ఉన్న మొత్తాన్ని తిరిగి బ్యాంకులకు చెల్లించాలని సూచించింది. తొలిగా మహిళల పేరుతో ఉన్న రుణాలను తొలి విడతలోనే మాఫీ చేయనున్నారు. పీఎం కిసాన్ పథకంలో ఉన్న వారిని అర్హులుగా నిర్ణయించింది. ఎన్ఐసీ నుంచి సేకరించిన సమాచారంతో క్రోడీకరించి అర్హులను ఫైనల్ చేస్తున్నారు. ప్రతీ బ్యాంక్ కు నోడల్ అధికారి నియామకం పైన నిర్ణయం తీసుకున్నారు.