తెలంగాణలో అమెరికా టెలికమ్యూనికేషన్ దిగ్గజం మైక్రోలింక్ నెట్ వర్క్స్ భారీ పెట్టుబడులను పెట్టేందుకు సిద్ధమైంది. రూ. 500 కోట్లతో రాష్ట్రంలో తమ ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మైక్రోలింక్ నెట్ వర్క్స్ ముందుకొచ్చిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
హైదరాబాద్ నగరానికి చెందిన పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో మైక్రోలింక్ పరిశ్రమల క్లస్టర్ను ప్రారంభిస్తుందని మంత్రి వెల్లడించారు. మైక్రోలింక్ గ్లోబల్ ప్రతినిధులు, భారతీయ భాగస్వామి పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ రంగారావు గురువారం మంత్రి శ్రీధర్ బాబుతో సచివాలయంలో సమావేశమయ్యారు.
వచ్చే మూడేళ్లలో రూ. 500 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్, ఐటీ, నిర్మాణరంగ పరికరాలను ఉత్పత్తి చేస్తుందని శ్రీధర్ బాబు ఈ సందర్భంగా తెలిపారు. దీంతో రానున్న మూడేళ్లలో 700 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇటీవల తన అమెరికా పర్యటనలో మైక్రోలింక్ నెట్ వర్క్స్ యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని మంత్రి తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులకు అంగీకరించారన్నారు.
డేటా ట్రాన్స్ మిషన్, నెట్ వర్కింగ్ కేబుల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మ్లల్టీ లెవల్ పార్కింగ్ మిషన్ల ఉత్పత్తిలో మైక్రోలింక్ నెట్ వర్క్స్ గ్లోబల్ లీడర్గా ఉంది. ఇప్పుడా కంపెనీ పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో పరిశ్రమలను ఏర్పాటు చేస్తుందని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్యం ఉన్న సిబ్బందికి కొరత లేదన్నారు. ఈ సమావేశంలో పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ రంగారావు తోపాటు డైరెక్టర్ నమ్యుత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధర్మరాజు చక్రవరం, మైక్రోటెక్ గ్లోబల్ ప్రతినిధులు డెనిస్ మొటావా, సియూన్ ఫిలిప్స్, జో జోగ్బి, అశోక్ పెర్సోత్తమ్, తదితరులు పాల్గొన్నారు.