స్వాతంత్రం వచ్చాక దేశవ్యాప్తంగా పదేళ్లకోసారి జనాభాను లెక్కించడం మన దేశంలో ఆనవాయితీగా వస్తోంది. అయితే ఎప్పుడో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయిస్తే జనాభా లెక్కింపుకు ఆటంకాలు ఏర్పడలేదు. కానీ మన దేశంలో 2021లో జరగాల్సిన జనాభా గణన మాత్రం నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. గతంలో కరోనా పేరుతో 2021లో జరగాల్సిన జన గణన వాయిదా వేసిన కేంద్రం.. అప్పటి నుంచి కారణాలు లేకుండానే వాయిదాల పర్వం కొనసాగిస్తోంది.
ఇలా దేశవ్యాప్తంగా జనాభా లెక్కించకుండానే 2011 జనాబా లెక్కల ఆధారంగా కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్నికలు , ఇతర ముఖ్యమైన కార్యక్రమాలన్నీ నిర్వహించేస్తున్నారు. అంటే దాదాపుగా 13 ఏళ్లుగా జనాభా గణన జరగలేదన్నమాట. దీంతో దేశంలో చేపడుతున్న సంస్కరణలతో పాటు ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది. అంతే కాదు ఇప్పుడు ఇలా ప్రపంచంలో జనాభా లెక్కించకుండా మీన మేషాలు లెక్కిస్తున్న అతి కొద్ది దేశాల సరసన చేరి చెత్త రికార్డు మూటగట్టుకోవాల్సిన పరిస్ధితి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రష్యా వంటి యుద్ధ ప్రభావిత దేశాలతో పాటు ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటున్న మరికొన్ని దేశాలు మాత్రమే జనాభాను లెక్కించడం లేదు. కానీ భారత్ లో అలాంటి పరిస్దితులేవీ లేకపోయినా జనాభా గణనను కేంద్రం నిరవధికంగా వాయిదా వేసేసింది. అంతే కాదు సార్వత్రిక ఎన్నికల వంటి భారీ ప్రక్రియలను చేపడుతున్న కేంద్రం.. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన జనాభా గణన విషయంలో మాత్రం వ్యూహాత్మక నిర్లక్ష్యం వహిస్తోంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే యుద్దం, సంక్షోభాల బారిన పడ్డ రష్యా, ఉక్రెయిన్, యెమెన్, సిరియా, మయన్మార్ వంటి దేశాలు జనాభా గణన నిర్వహించడం లేదు. అలాగే అంతర్యుద్ధం బారిన పడ్డ ఆప్ఘనిస్తాన్, ఆర్ధిక సంక్షోభం బారిన పడ్డ శ్రీలంక వంటి దేశాలు కూడా ఇందులో ఉన్నాయి. అత్యధిక జనాభా కలిగిన పది దేశాలలో భారత్ తో పాటు చైనా, నైజీరియా మాత్రమే ఇంకా జనాభా గణనను నిర్వహించలేదు. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ వంటి దేశాలు కూడా జనగణన నిర్వహిస్తుంటే భారత్ మాత్రం ఇలా వాయిదాల పర్వం కొనసాగిస్తుండటం విశేషం.









