ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పంచాయతరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ గురువారం తనకు కేటాయించిన శాఖలపై వరుస సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించే దిశగా రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా ఆవిష్కరణలు దిశగా విద్యార్థులను తీర్చేదిద్దే ప్రయత్నం వేగంగా కొనసాగాలని సూచించారు. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల ఆసక్తిని పెంచుదామని, ఈ దిశగా అధికారులు కృషి చేయాలని పవన్ పేర్కొన్నారు. పిల్లలకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపై ఆసక్తి కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లాలని పవన్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని బాలల్లో చాలా ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభను వెలికి తీసేలా భారీ సైన్స్ ఎగ్జిబిషన్ లు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు.
గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పూర్తి స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా రాబోయే తరాల్లో సైన్స్ పట్ల ఆసక్తి ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజమండ్రి ఎస్ఆర్ఎస్సీ ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్ర ప్రారంభానికి సిద్ధంగా ఉందని చెప్పారు. దీన్ని త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువద్దామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.









