నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ను నిలిపివేయాలంటూ దాఖలైన అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కౌన్సెలింగ్పై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే ఈ పిటిషన్పై విచారణలో భాగంగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తోపాటు కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. MBBS,BDS ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన NEET UG 2024ను సవాల్ చేస్తూ దాఖలైన 3 పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.
నీట్ కౌన్సెలింగ్ను ఆపేది లేదని.. కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై దాఖలైన పిటిషన్లపై 2 వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు పంపింది. తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. జులై 6 నుంచే నీట్ కౌన్సెలింగ్ జరగనుంది.
మరోవైపు వివాదాస్పద గ్రేస్ మార్కుల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న 1,563 మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేశామని, వాళ్లకు ఈ నెల 23న మళ్లీ పరీక్షనిర్వహిస్తామని..ఆ తర్వాతే వాళ్లకు కౌన్సెలింగ్ ఉంటుందని ఎన్టీఏ, కేంద్రం కోర్టుకు నివేదించాయి.
ఈ ఏడాది మే5న నిర్వహించిన నీటి పరీక్ష ఫలితాలు ఇటీవలే వెల్లడయ్యాయి. ఈ పరీక్ష ఫలితాల్లో 67 మంది విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించారు. వారిలో ఒకే సెంటర్ నుంచి పరీక్ష రాసిన విద్యార్థులు ఆరుగురు ఉండటం వివాదానికి కారణమైంది. 1563 మందికి ఇచ్చిన గ్రేస్ మార్కులపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సిలబస్ లో మార్కులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం లేట్ అవ్వడంతో.. ఈ మార్కులను కలపడంపై అనుమానాలు రావడంతో.. అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
దాంతో కేంద్ర విద్యాశాఖ నీట్ ఫలితాలపై నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థులపై కమిటీ విచారణ జరిపి నివేదికను సమర్పించగా.. కమిటీ నిర్ణయాలను కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. సమయాన్ని కోల్పోయిన కారణంగా పరిహారంగా గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డుల్ని రద్దు చేయాలని కమిటీ నిర్ణయించింది. అలాగే వారందరికీ జూన్ 23న పరీక్ష నిర్వహించి 30న ఫలితాలను వెల్లడిస్తామని, ఆ తర్వాత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది. మళ్లీ పరీక్ష వద్దనుకునేవారు గ్రేస్ మార్కులు లేకుండా కౌన్సెలింగ్ కు వెళ్లొచ్చని పేర్కొంది.