తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ విషయం ఏపీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంలో లోకేష్ది కీలక పాత్ర కాబోతోంది. రెడ్ బుక్ బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది అధికారులు తమ పరిధి, స్థాయి మరిచి వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు పెట్టడంతోపాటు అక్రమ అరెస్ట్ల పర్వాన్ని యథేచ్చగా కొనసాగించారు. వారిని వదిలిపెట్టేది లేదని, అందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని నారా లోకేష్ హెచ్చరించారు.
తప్పు చేసినవారిని వదిలేది లేదు తమను హెచ్చరించారంటూ సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ కూడా వేశారు. తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ఘనవిజయం సాధించింది. తర్వాత లోకేష్ మీడియాతో మాట్లాడుతూ కక్ష సాధింపులు అనేవి తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. ఈ మాటలను బట్టి రెడ్ బుక్ ను అమలు చేయరని భావించారు. అయితే ఇదే అంశంపై లోకేష్ కక్ష సాధింపులు ఉండబోవని చెప్పానుకానీ, తప్పు చేసినవారి వదలిపెడతామని చెప్పలేదన్నారు. తప్పు చేసినవారందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని, వారందరిపై చర్యలు తీసుకుంటానని లోకేష్ హామీ ఇచ్చారు.
కనీస సాక్ష్యాలు కూడా లేవు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 53 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. వ్యవస్థలను మానేజ్ చేసిన జగన్ తన పంతాన్ని నెరవేర్చుకున్నారు. ఆయనకు బెయిల్ ఇచ్చే సమయంలో కనీసం సాక్ష్యాలు కూడా లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది.
అచ్చెన్నాయుడితోపాటు, అయ్యన్నపాత్రుడు, ధూళిపాళ్ల నరేంద్ర, పొంగూరి నారాయణ తదితరులపై జగన్ ప్రభుత్వం కేసులు నమోదు చేయడంతోపాటు అరెస్ట్ లు చేసింది. తమపై పెట్టింది తప్పుడు కేసులేనని, అసలు చార్జిషీట్లు కూడా వేయలేదని వీరంతా గుర్తుచేస్తున్నారు. వీటిపై ఓ కమిషన్ వేసి అధికారులను శిక్షించే అవకాశం ఉందంటున్నారు.









