వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంపై లేనిపోని కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లడ్డూలో జంతువుల కొవ్వు, కెమికల్స్ కలిపారన్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే తిరుమలలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
నెయ్యి కాంట్రాక్టుల విషయంలో చంద్రబాబు తన అనుకూల సంస్థలకు లబ్ధి చేకూర్చడానికే ఈ తరహా రాజకీయం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. మార్కెట్లో హెరిటేజ్ నెయ్యి ధర కంటే ఇందాపూర్, అమూల్ వంటి సంస్థల ధరలు తక్కువగా ఉన్నాయని, కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమే భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. నెయ్యి కొనుగోలు వ్యవహారంలో భారీ కుంభకోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ, దీనిపై వెంటనే సీబీఐ (CBI) విచారణ జరిపించాలని సజ్జల డిమాండ్ చేశారు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి సంబంధించిన వీడియోల వివాదంపై స్పందిస్తూ, గతంలో తమ ప్రభుత్వ హయాంలో సినీ నటుడు పృథ్వీపై ఆరోపణలు రాగానే తక్షణమే రాజీనామా చేయించామని సజ్జల గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం బీఆర్ నాయుడి విషయంలో చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ బీఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సజ్జల డిమాండ్ చేశారు.







