టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారంటూ బాంబు పేల్చారు. ఆయన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కలకలం రేపాయి. ఇంతకీ కొలికపూడి వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు? ఇదే చర్చ టీడీపీలో జోరుగా నడుస్తోంది.
టీడీపీలో ఎమ్మెల్యే కొలికపూడి వ్యాఖ్యలు కలకలం
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గురువారం రాత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా మందుకొచ్చిన ఆయన, కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తనపై కేసులు నమోదు చేసిందని, ఏ రోజూ దాడి చేయలేదన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వంలో తనపై దాడి, లేకుంటే చంపేందుకు కుట్ర జరుగుతోందని చెప్పకనే చెప్పారు.
నెమలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించి ఇంటికి వచ్చానని అన్నారు. నిఘా వర్గాల ద్వారా తనకు అందిన సమాచారం మేరకు.. దేవాలయానికి వెళ్లిన తర్వాత ఎంపీ చేతుల నుంచి పట్టు వస్త్రాలు తాను తీసుకున్నానని చెప్పారు. ఈ వ్యవహారం రాత్రి 9.30 గంటల సమయంలో జరిగిందన్నారు. కానీ మధ్యాహ్నం నుంచి జనాన్ని ఎందుకు సమీకరించారని ప్రశ్నించారు.
నన్ను చంపేందుకు కుట్ర.. విచారణ జరిపించాలని డిమాండ్
ఎంపీ కార్యాలయం నుంచి తన నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కొంత మందికి ఫోన్ చేసి, ఎమ్మెల్యేపై దాడి చేయమని ఎందుకు చెప్పారంటూ ప్రశ్నించారు. నెమలి కళ్యాణం సమయంలో కరెంట్ తీసివేసి తనపై దాడి చేయాలని ప్లాన్ చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. అందుకు పోలీసులు ఏమాత్రం అంగీకరించలేదని తెలిసిందన్నారు.
తన కారు అద్దాలు పగలగొట్టి, టైర్ల గాలి తీసి దాడి చేయాలనే స్పష్టమైన సమాచారం ఉందన్నారు. తనకు భద్రత కల్పించలేదని, కనీసం కానిస్టేబుల్ కూడా ఇవ్వలేదన్నారు. తనను అవమానిస్తే సహిస్తానేమో కానీ, నా జాతిని అవమానిస్తే మాత్రం తెగిస్తానని వ్యాఖ్యానించారు. తనను భూమి మీద లేకుండా చేయడానికి చేస్తున్న కుట్రలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
కేవలం రేషన్ బియ్యం మాఫియాను ప్రశ్నించినందుకు తనను టార్గెట్ చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తాను ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పకనే చెప్పారు. కొలికిపూడి వ్యాఖ్యలకు ముందు ఓ ఛానెల్తో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడారు. చెప్పిన విషయాలపై ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలన్నారు.
గాలి విషయాలను తాను ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకోవాలని వైసీపీకి చెందిన ఓ నేత ఉన్నారని అన్నారు. ఆ వ్యక్తి కనీసం కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలవలేదని చెప్పుకొచ్చారు. మొత్తానికి టీడీపీలో కొలికిపూడి ఎపిసోడ్ ఇంకెన్నాళ్లు సాగుతుందో చూడాలి.








