ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటివరకూ సీఎం హోదాలో ఉంటూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో తన అక్రమాస్తుల కేసు విచారణకు హాజరుకాకుండా వాయిదాలపై వాయిదాలు కోరుతూ విచారణ ఆలస్యం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత మరో షాక్ తగిలింది. గతంలో వాయిదా పడిన జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను తిరిగి ఈ నెల 19న ప్రారంభిస్తున్నట్లు హైదరాబాద్ సీబీఐ కోర్టు వర్గాలు తెలిపాయి.
జగన్ అక్రమాస్తుల కేసులో 127 మంది నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణను ఈ నెల 19న తిరిగి ప్రారంభిస్తున్నారు.ఈ కేసులు బుధవారం లిస్టింగ్ కు రాగా జగన్ తో పాటు ఇతర నిందితులు వాయిదాలు కోరారు. దీంతో 19న విచారణ చేయాలని హైదరాబాద్ సీబీఐ కోర్టు నిర్ణయించింది. ఇకపై ఈ కేసుల్లో రెగ్యులర్ విచారణ జరుగుతుందని కొత్త న్యాయమూర్తి రఘురామ్ తెలిపారు.
ఈ కేసులను రెండు నెలల్లోగా పరిష్కరించాలని గతంలో సీబీఐ కోర్టును తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంజి. గతంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి బదిలీ కావడంతో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ జరిగినా వాటిపై తీర్పు వెలువడలేదు. దీంతో ఐదేళ్లుగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ లో ఉన్న కేసులపై ప్రత్యేక న్యాయస్థానం విచారణ ప్రారంభించాలని తెలంగాణ హైకోర్టు తాజాగా వేర్వేరు పిటిషన్లలో ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లలో ఇక జాప్యం చేయరాదని పేర్కొన్న సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీని ఫార్వార్డ్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.