ఏపీలో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ కాల్ చేశారు. ఏపీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయంపై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఎక్స్ లో చంద్రబాబుకు ఓసారి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ .. ఇవాళ నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ సంకేతాలు ఇచ్చారు.
చంద్రబాబుకు ఇవాళ ఫోన్ కాల్ లో శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి.. అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు నెలకొనాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. అలాగే విభజన సమస్యల పరిష్కారానికి కలిసి రావాలని చంద్రబాబును రేవంత్ కోరారు. దీంతో చంద్రబాబు కూడా కలిసి పనిచేసేందుకు సిద్ధమని చెప్పినట్లు తెలిసింది. అలాగే విభజన సమస్యల్ని కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకునేందుకు సిద్ధమన్నారు.
మరోవైపు ఈ నెల 12న జరిగే తన ప్రమాణస్వీకారానికి రావాలని కూడా చంద్రబాబు రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. త్వరలో అధికారికంగా ఆహ్వానం పంపుతామని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే వెళ్తానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అలాగే కొత్తగా ఏర్పాటయ్యే ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని కూడా ఫలితాలకు ముందే రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో ఈ గురుశిష్యులు కలిసి పనిచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.