ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. కీలక నిర్ణయాలకు సిద్దం అవుతోంది. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన వాలంటీర్ల వ్యవస్థ పైన మార్పులు జరగనున్నాయి. భారీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వాలంటీర్ల వ్యవస్థ అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు వాలంటీర్ల నియామకంతో పాటుగా వ్యవస్థ కొనసాగింపులో సమూల మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. జీతం పెంపు పైన నిర్ణయం తీసుకోనున్నారు.
కీలక నిర్ణయాలు వాలంటీర్ల వ్యవస్థ పైన చంద్రబాబు కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నిర్ణయాల అమలు దిశగా కసరత్తు జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ వేతనం రూ 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇక..ఇప్పుడు తాజాగా జరుగుతున్న కసరత్తు మేరకు ప్రతీ గ్రామంలో ఐదుగురు మాత్రమే వాలంటరీలు ఉంటారని చెబుతున్నారు. ఇప్పుడున్న 5000 జీతాన్ని పదివేల రూపాయలకు పెంపు దిశగా నిర్ణయం అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి విధి విధానాలను ఖరారు చేయనుంది.
నియామకంలో మార్పులు వాలంటీర్ల నియామకంలో డిగ్రీ ఉత్తీర్ణత చెంది 1994నుండి 2003 వరకు వయసు వయోపరిమితి గా నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో విధులుకు హాజరు అయ్యేలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. వాలంటరీ సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచుల ఆధీనంలో పూర్తి అధికారం ఉండేలా విధి విధానాల రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక..కొత్తగా ప్రతి గ్రామానికి సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని పథకాల నిర్వహణ..బట్వాడాలోనూ మార్పులు చేయనున్నట్లు సమాచారం.
వ్యవస్థలో సంస్కరణలు ఇప్పటి వరకు ప్రతీ నెలా వాలంటీర్ ఇంటికి వెళ్లి అందించే పెన్షన్ విషయం పైన పునరాలోచన చేస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రతి నెల ఇచ్చే పెన్షన్ దారులకు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయాలా..ప్రస్తుత విధానం కొనసాగించాలా అనే అంశం పైన ప్రభుత్వం ఏర్పాటు తరువాత తుది నిర్ణయం తీసుకోన్నారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త కార్యాచరణ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, పాలనలో కీలకంగా మారునున్న వాలంటీర్ వ్యవస్థ పైన అన్ని కోణాల్లోనూ కసరత్తు చేసిన తరువాతనే తుది నిర్ణయం తీసుకోవాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు.