తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఎన్నికల ఫలితాల తరువాత రైతు భరోసా తో పాటుగా రైతు రుణ మాఫీ పైన ప్రభుత్వం కీలక ప్రకటనకు సిద్దం అవుతోంది. రైతు భరోసా అమలు..సీలింగ్ పైన ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త నిర్ణయం మేరకు జూలై నుంచి అమలు దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. సీలింగ్ పై తీసుకొనే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
పరిమితి ఎంత రైతు భరోసా అమలు పరిమితి ఎన్ని ఎకరాలకు ఖరారు చేస్తారనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. మరో రెండు, మూడు రోజుల్లో ప్రారంభం కానున్న వానాకాలం సీజన్కు రైతు భరోసాపథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసాను ఐదెకరాలకే పరిమితం చేస్తారా.. లేదంటే పది ఎకరాల వరకు కటాఫ్ పెడతారా.. అనే చర్చ సాగుతోంది. గత డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ.. యాసంగి సీజన్లో పాత పద్ధతి ప్రకారమే(ఎకరాకు రూ.5వేల చొప్పున) రైతు బంధు అమలు చేసింది. బీఆర్ఎస్ హయాంలో రైతుకు ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతుబంధు ఇస్తూ వచ్చారు. అయితే, ఈ పథకానికి పరిమితులు విధించి, ఎకరాకు రూ.7,500 చొప్పున అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వం కసరత్తు ఈ పరిమితి ఎంత వరకు విధిస్తారనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఎన్నికల ఫలితాల తరువాత ముందుగా క్యాబినెట్ సమావేశంలో, ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ చర్చించా లనే ఆలోచనతో సీఎం రేవంత్రెడ్డి ఉన్నట్లు సమాచారం. అయితే, కేంద్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించిన తర్వాతే… రాష్ట్రంలోనూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఒక వేళ కేంద్ర బడ్జెట్ ఆలస్యమైతే… రాష్ట్ర మంత్రి వర్గంలోనే రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇచ్చిన హామీ ప్రకారం ఎకరాకు రూ.7500 చొప్పున చెల్లించనుంది. కాగా, కౌలు రైతులకూ రైతు భరోసా పథకం అమలు చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది.
అమలు దిశగా భూ యజమానుల నుంచి అఫిడవిట్ తీసుకొని వ్యవసాయ శాఖకు సమర్పిస్తేనే కౌలు రైతులకు రైతు భరోసా అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అయితే, ఈ అంశంపై కూడా క్యాబినెట్ భేటీలో, వీలైతే అసెంబ్లీలోనూ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ప్రతి సీజన్లో కోటిన్నర ఎకరాలకు పెట్టుబడి సాయం పంపిణీ చేస్తున్నప్పటికీ… సాగు విస్తీర్ణం అంత ఉండడం లేదు. కాగా, రెవెన్యూ-వ్యవసాయశాఖ అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి, ఈ భూములపై క్షేత్రస్థాయిలో సర్వే చేయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్లోనే సర్వే ప్రారంభించి, వ్యవసాయ భూముల లెక్కలు తేల్చాలని భావిస్తోంది. దీంతో..రైతు భరోసా పరిమితి పై ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.