UPDATES  

NEWS

 57 స్థానాలకు నేడు తుది దశ పోలింగ్..!

సార్వత్రిక ఎన్నికల్లో ఏడోది, చివరి విడత పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివరాం (జూన్‌ 1న) 8 రాష్ట్రాల్లోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ఇందులో ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌లో 13 చొప్పున స్థానాలు ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌లో 9, బీహార్‌ 8, ఒడిశా 6, హిమాచల్‌ ప్రదేశ్‌ 4, జార్ఖండ్‌ 3, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లోని ఒకచోట పోలింగ్‌ జరగనుంది.

 

ఏడువిడత లోకసభ ఎన్నికల్లో ముఖ్యంగా ఐదు స్థానాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందులో మొదటిది ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి ఉండటం గమనార్హం. ఆయన ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ తరఫున అజయ్‌ రాయ్‌ పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి రెండుసార్లు విజయం సాధించిన మోడీ.. ఇప్పుడు మూడోసారి జయకేతనం ఎగురవేసి హ్యాట్రిక్‌ సాధించాలని భావిస్తున్నారు.

 

మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్‌ గోరఖ్‌పుర్‌లో సినీనటుల మధ్య పోటీ నెలకొంది. బీజేపీ తరఫున భోజ్‌పురీ నటుడు రవికిషన్‌, నటి కాజల్‌ నిషాద్‌ సమాజ్‌వాదీ పార్టీ నుంచి బరిలో నిలిచారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి. ఇక్కడ్నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీ తరపున బరిలో ఉన్నారు. ఇక్కడ రాజు, రాణి మధ్య పోటీ నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ బీజేపీ తరఫున తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. మండి నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా పేరుంది. ఇక్కడి నుంచి ఆ పార్టీ తరఫున రాజకుటుంబానికి చెందిన విక్రమాదిత్యసింగ్‌ పోటీలో ఉన్నారు. ఆయన మాజీ సీఎం వీరభద్రసింగ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌ ప్రతిభాదేవి సింగ్‌ దంపతుల కుమారుడు. మరోవైపు, హిమాచల్‌ ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌లో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో కాంగ్రెస్‌ అభ్యర్థి సత్‌పాల్‌ సింగ్‌ రాయ్‌జాదా తలపడుతున్నారు. అనురాగ్‌ ఠాకూర్‌ ఇక్కడి నుంచి ఇప్పటివరకు వరుసగా 3 సార్లు ఎంపీగా గెలుపొందారు.

 

కాగా, చివరి విడత పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఓటింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఏడోవిడత ఎన్నికల బరిలో వివిధపార్టీల తరఫున 904మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పంజాబ్‌లో అత్యధికంగా 328మంది, ఆ తర్వాత వరుసగా యూపీలో 144 మంది, బిహార్‌ 134, ఒడిశా 66, జార్ఖండ్ 52, హిమాచల్‌ ప్రదేశ్ 37, చండీగఢ్‌లో 19మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. నేటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియనుంది. దీంతో శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ఎగ్జిట్ పోల్స్ వెలువడే అవకాశం ఉంది. జూన్ 4న అసలైన ఫలితాలు వెలువడతాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |