ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. అయితే పోలింగ్ అనంతరం కొన్ని నియోజకవర్గాల్లో హింస చేలరేగింది. ముఖ్యంగా పల్నాడు, తిరుపతి, నరసారావుపేట, , చంద్రగిరి ,తాడిపత్రి నియోజకవర్గాల్లో చేలరేగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. దీనిపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇదిలా ఉంటే పోలింగ్కు ముందు నుంచే పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎన్నికల తర్వాత కూడా రెండు రోజులపాటు టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న పరిస్థితి జిల్లాలో కనిపించింది.
అయితే పోలింగ్ నాడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే కౌంటింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో మంత్రి అంబటి రాంబాబు సంచలనానికి తెరలేపారు.సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని 236, 237, 253, 254 పోలింగ్ బూత్లలో రీ పోలింగ్ నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్లో ఈసీ, సీఈవో సహా మరో ఐదుగురిని చేర్చారు. కాగా, ఆ పిటిషన్పై గురువారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మరోవైపు మాచర్లలో రీ పోలింగ్ నిర్వహిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడంతో అక్కడ రీ పోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా దీనిపై ఎన్నికల ప్రధాన అధికారి మీనా వివరణ ఇవ్వడం జరిగింది. ఈవీఎం ధ్వంసం అయినా అందులోని డేటా భద్రంగా ఉందని అన్నారు. మాచర్లలో రీ పోలింగ్ నిర్వహించే అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.









