తెలంగాణలో ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశం పైన భారీ అంచనాలు ఉన్నాయి. రైతు రుణమాఫీతోపాటు, రాష్ట్ర ఆదాయం పెంపు, వర్షాకాల సీజన్ లో చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ఎన్నికల సంఘం నుంచి కేబినెట్ భేటీ నిర్వహణ పైన ఇంకా అనుమతి రాలేదని తెలుస్తోంది.
ముఖ్య నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. లోక్సభ ఎన్నికల కారణంగా కేబినెట్ సమావేశం నిర్వహించక చాలా రోజులు అయ్యింది. దీంతో ఈ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండటంతో, పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలు, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినేట్లో చర్చించనున్నారు. 9,10 షెడ్యూల్ లోని ఆస్తులపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
రైతు రుణమాఫీ పైనా ఆగస్ట్ 15లోపు రైతుల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. రుణమాఫీ కోసం దాదాపు రూ. 40 వేల కోట్లు అవసరం. ఇందుకు సంబంధించి రైతు కార్పోరేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే అధికారులు బ్యాంకర్లతో ఈ అంశం పైన చర్చించి ప్రతిపాదనలు సిద్దం చేసారు. నేటి కేబినెట్ సమావేశంలోనే రైతు కార్పోరేషన్ పై నిర్ణయం తీసుకోనుంది. అలాగే ధాన్యం కొనుగోళ్ల పురోగతిని కేబినెట్ సమీక్షించనుంది. జూన్ నెల అరంభం నుంచి ఖరీఫ్ పంట సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, నీటి ప్రణాళికపై చర్చ జరుగనుంది.
రెవిన్యూ మార్గాలపై ఫోకస్ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో పాటు వనరుల సమీకరణకు తీసుకోవలసిన చర్యలపై కేబినెట్లో చర్చిస్తారు. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని కేబినెట్ నిర్ణయించే అవకాశముంది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి వస్తే అధికారికంగా మంత్రివర్గ సమావేశం..లేకుంటే మంత్రులతో సమీక్ష జరిగేలా సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.









