UPDATES  

NEWS

 ఏపీలో సిట్ దర్యాప్తు మొదలు-అరెస్టుల భయంతో అజ్ఞాతంలోకి నేతలు..?

ఏపీలో ఈసారి ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో నిన్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ దర్యాప్తు ప్రారంభించింది. ముఖ్యంగా మాచర్ల, గురజాల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ ప్రధానంగా దృష్టిసారించింది. దీంతో హింసకు కారకులైన నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

 

పల్నాడులో ఎన్నికల పోలింగ్ నుంచే చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ప్రారంభించింది. దీంతో సిట్ ఏర్పాటుకు ముందే ఇక్కడి నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే వారిని హౌస్ అరెస్టు చేసినా తప్పించుకుని మరీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరిలో కొందరు హైదరాబాద్ కు, మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సిట్ దర్యాప్తులో తమ పాత్ర బయటపడితే అరెస్టులు తప్పవన్న సంకేతాలే ఇందుకు కారణం.

 

అలాగే రాయలసీమలోనూ పోలింగ్ రోజు నుంచే మొదలైన హింసాత్మక ఘటనలను అడ్డుకోవడంలో అక్కడి పోలీసులు తీవ్రంగా విఫలమయ్యారు. దీనికి బాధ్యుల్ని చేస్తూ ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులపైనే ఈసీ వేటు వేసింది. ఈసారి వేటుతో సరిపెట్టకుండా సస్పెన్షన్ల వరకూ వెళ్లింది. శాఖాపరమైన విచారణ కూడా జరుపుతోంది. దీంతో తాడిపత్రి, చంద్రగిరిలో నేతలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. అన్నీ సవ్యంగా జరిగితే హింసకు కారణమైన పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది.

 

రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు చేసి రెండు రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఈసీ కోరిన నేపథ్యంలో అధికారులు పరుగులు పెడుతున్నారు. ఈసీ ఇప్పటికే ఈ హింసపై సీరియస్ గా ఉండటంతో మరిన్ని చర్యలు ప్రకటించేలోపు తమ నివేదిక ఇచ్చేందుకు సిట్ కూడా కసరత్తు చేస్తోంది. ఇవాళ దర్యాప్తు పూర్తి చేసి సాయంత్రం లేదా రేపటికి ఈసీకి నివేదిక ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే హింసకు కారకులపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్ధితి. బాధ్యుల్ని అరెస్టు చేసి కోర్టులో నిలబెట్టాలని ఈసీ నుంచి ఆదేశాలు రావడంతో ఆ మేరకు అరెస్టులు తప్పేలా లేవు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |