UPDATES  

NEWS

 తగ్గిన గ్యాస్ సిలిండర్ల ధరలు…

మూడో విడత లోక్‌సభ ఎన్నికల కోసం దేశ యావత్తూ సర్వ సన్నద్ధమౌతోంది. ఈ నెల 7వ తేదీన మూడవ విడత పోలింగ్ షెడ్యూల్ అయింది. మొత్తం 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 94 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతుందా రోజున.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ అదే రోజున పోలింగ్ ఉంటుంది. మొత్తం 26 సీట్లకూ ఒకే విడతలో ఓటింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. కర్ణాటకలో మిగిలిన 14 స్థానాల ఓటర్లు కూడా అప్పుడే తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.

 

ఆయా స్థానాల్లో ప్రస్తుతం ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్/ఇండియా కూటమి అభ్యర్థులు రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా.. సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు.

 

ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం తీపి కబురు ఇచ్చింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించింది. ఒక్కో సిలిండర్‌పై 19 రూపాయల మేర తగ్గింపును ప్రకటించింది. తగ్గించిన ధరలు ఈ తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి.

 

దీనితో దేశ రాజధానిలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటు రూ.1,745.50 పైసలకు తగ్గింది. ముంబైలో రూ.1,698.50 పైసలు పలుకుతోంది. కోల్‌కతలో 1,859 రూపాయలుగా నమోదైంది. చెన్నైలో రూ.1,911 రూపాయలకు చేరింది. తగ్గింపు స్వల్పమే అయినప్పటికీ కొంత వరకు కమర్షియల్ వంటగ్యాస్ వినియోగదారులకు ఊరట కల్పించినట్టయింది.

 

గృహావసరాల వంటగ్యాస్ కనెక్షన్ల రేట్లను కేంద్ర ప్రభుత్వం తగ్గించలేదు. వాటి రేట్లు యధాతథంగా ఉన్నాయి. డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ల రేట్లను కూడా తగ్గించవచ్చంటూ మొదట్లో అంచనాలు వ్యక్తం అయ్యాయి. 50 రూపాయల వరకు తగ్గొచ్చనే అంచనాలు వెలువడ్డాయి గానీ అవి వాస్తవ రూపం దాల్చలేదు. వాటికి బదులుగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల రేట్లు కాస్త తగ్గుముఖం పట్టాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |