దేశంలో ఎటుచూసినా ఎన్నికల వేడి కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్నీ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఈ తరుణంలో నేడు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల క్రమంలో తెలంగాణలో బీజేపీ ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 30) ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ప్రధాని మోడీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ అభ్యర్థి రఘునందన్రావుకు మద్ధతుగా నేడు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. దీంతో పాటు ప్రధాని మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అల్లాదుర్గ్లోని ఐవీ చౌరస్తా వద్ద జరగనున్న జహీరాబాద్-మెదక్ జనసభలోనూ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ప్రధాని మోడీ ముందుగా వచ్చేనెల 3, 4వ తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేస్తారని మొదట బీజేపీ వర్గాలు తెలిపాయి. కానీ, ఈ తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన అనుకోని పరిస్థితుల్లో వాయిదా పడింది. వచ్చే నెల 8, 9 తేదీల్లో ప్రధాని తెలంగాణ రాష్ట్రంలో మరోసారి పర్యటించనున్నారని సమాచారం. వచ్చే నెల 8వ తేదీన వేములవాడలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారని తెలుస్తోంది. అయితే, అంతకుముందే, అంటే నేడు తెలంగాణలో మోదీ పర్యటించనున్నారు. ప్రధాని మోదీ మంగళవారం (ఏప్రిల్ 30) సాయంత్రం 4:20 గంటల సమయంలో హెలికాప్టర్లో జహీరాబాద్కు చేరుకుంటారు. అక్కడి నుంచి జహీరాబాద్-మెదక్ జనసభ ప్రాంగణానికి చేరుకుని, సాయంత్రం 4:30 గంటల నుంచి 5:20 వరకు ప్రజాసభలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సభ ముగిసిన అనంతరం 5:30 గంటలకు జహీరాబాద్ నుంచి దుండిగల్ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి ప్రయాణమవుతారు.
మే 1న తెలంగాణలో అమిత్ షా పర్యటన..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో బిజెపి ఎన్నికల ప్రచారం మమ్మురంగా సాగుతోంది. నేడు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఉండగా, వచ్చే నెల 1వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మే 1న చార్మినార్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని గౌలిపురలో సాయంత్రం 5 గంటలకు నిర్వహించే రోడ్ షోలో అమిత్షా పాల్గొననున్నారు. ఈ రోడ్ షో లాల్దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి శాలిబండ సుధా థియేటర్ వరకు కొనసాగనుంది.









