దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్ సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇవాళ ఉదయం నుంచే ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరారు. అయితే ఎండ వేడిమి కారణంగా పలు చోట్ల మధ్యాహ్నానికి పోలింగ్ మందగించింది. తిరిగి సాయంత్రానికి ఓటర్లు పోలింగ్ బూత్ లకు తరలివచ్చారు. మొత్తం 102 సీట్లకు జరిగిన ఈ పోలింగ్ లో సగటున దాదాపు 60 శాతం పైగా పోలింగ్ నమోదైంది.
ఈసారి లోక్ సభకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా ఇవాళ 102 సీట్లలో పోలింగ్ జరిగింది. ఇందులో తమిళనాడు (39), రాజస్థాన్ (12), ఉత్తరప్రదేశ్ (8), మధ్యప్రదేశ్ (6), ఉత్తరాఖండ్ (5), అరుణాచల్ ప్రదేశ్ (2), మేఘాలయ (2), అండమాన్-నికోబార్ దీవులు (1), మిజోరం (1), నాగాలాండ్ (1), పుదుచ్చేరి (1), సిక్కిం (1) లక్షద్వీప్ (1) సీట్లు ఉన్నాయి. అలాగే అసోం, మహారాష్ట్రలో ఐదు, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో మూడు, మణిపూర్లో 2, త్రిపుర, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్లో ఒక్కో సీట్లకూ ఎన్నికలు జరిగాయి.
సాయంత్రం 5 గంటల కల్లా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 59.7 శాతం ఓటింగ్ నమోదైంది. తమిళనాడులో 63.2 శాతం, రాజస్థాన్లో 50.3 శాతం, ఉత్తరప్రదేశ్లో 57.5 శాతం, మధ్యప్రదేశ్లో 63.3 శాతం పోలింగ్ నమోదైంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు జరుగుతున్న రాష్ట్ర ఎన్నికల్లో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో వరుసగా 67.5, 64.7 శాతం పోలింగ్ శాతాలు నమోదయ్యాయి. ఈ ఎన్నికల కౌటింగ్ జూన్ 4న మిగతా సీట్లతో కలిపి జరగనుంది.









