ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మధ్య సీట్ల ఎంపిక దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టే! టీడీపీ ఐదారు మినహా అన్నింటినీ ప్రకటించింది. ఇప్పుడు జనసేన వంతైంది. ఇప్పటివరకు కేవలం ఏడు సీట్లను మాత్రమే ప్రకటించింది. మిగతా వాటిని పెండింగ్లో పెట్టింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులతో మంతనాలు సాగించారు జనసేన అధినేత పవన్కల్యాణ్.
తాజాగా 11 స్థానాలకు చెందిన అభ్యర్థులను పిలిపించి వారికి విధివిధానాలను తెలియజేశారు పవన్ కల్యాణ్. అంతేకాదు ప్రచారంలోకి దిగాలని పవన్ నుంచి స్పష్టమైన సంకేతాలు వెళ్లాయి. వారిలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్బాబు, యలమంచిలి నుంచి సుందరపు విజయకుమార్, విశాఖ దక్షిణ నుంచి వంశీకృష్ణయాదవ్ ఉన్నారు. తూర్పుగోదావరి నుంచి రాజోలు నుంచి దేవ వరప్రసాద్, పి.గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ దాదాపు సీట్లు ఖరారైనట్లు తెలుస్తోంది.
ఇక వెస్ట్ గోదావరి జిల్లా నుంచి పోలవరం నుంచి చిర్రి బాలరాజు, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, నర్సాపురం బొమ్మడి నాయకర్, భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్లకు దాదాపుగా గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు దాదాపు ఖాయమైనట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ సీటు విషయమై తిరుపతి జనసేన నేతలను పిలిచి నాగబాబు మాట్లాడారు. ఇక్కడి నుంచి హరిప్రసాద్, కిరణ్రాయల్, టీడీపీ నుంచి సుగుణమ్మతోపాటు మరో ఇద్దరు నేతలు టికెట్ను ఆశిస్తున్నారు.
మరో మూడు స్థానాల్లో అభ్యర్థులు ఎవరన్నది తేలాల్సివుంది. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ, కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ, కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేయాల్సిఉంది. మరోవైపు మచిలీపట్నం ఎంపీ సీటును బాలశౌరిని ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీలో సీట్ల కసరత్తు ముమ్మరం చేసింది బీజేపీ హైకమాండ్. ఆలస్యమైన కొద్దీ ఆశావహుల్లో టెన్షన్ పెరుగుతోంది. దీనికితోడు సమయం దగ్గరపడుతుండడంతో అటువైపు దృష్టి సారించింది. ఇందులో భాగంగా శనివారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయ్యింది. పెండింగ్లో ఉన్న స్థానాలపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల ముఖ్యనేతలతో మంతనాలు సాగించినట్టు సమాచారం. ఆరు ఎంపీ సీట్లకు బీజేపీ పోటీ చేస్తోంది. ఎవరెవరు ఎక్కడైతే బాగుంటుందని నేతలతోపాటు సర్వేల ఆధారంగా ఎంపిక పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
వాటిలో అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, రాజంపేట, తిరుపతి, కడప, ఒంగోలు, అనంతపురం ఉన్నాయి. వీటిలో ఆరు నియోజకవర్గాల నుంచి బీజేపీ పోటీ చేయనుంది. మిగతా నాలుగింటిలో టీడీపీ బరిలోకి దిగనుంది. ఇక టీడీపీ ఇప్పటికే 13 సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. జనసేన అయితే మచిలీపట్నం దాదాపు బాలశౌరికి ఓకే చెప్పినట్టు సమాచారం. కాకినాడ సీటును మాత్రం పెండింగ్లో పెట్టింది. ఇందులో నాగబాబు దిగుతారా? లేక మరెవరైనా ఉన్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ వారంలో పెండింగ్లోఉన్న ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులు సీట్లు కొలిక్కిరావచ్చని అంటున్నాయి పార్టీ వర్గాలు.









