UPDATES  

NEWS

 ఢిల్లీ లిక్కర్ కేసుకు.. ఎలక్టోరల్ బాండ్లకు లింక్ ఉందా…? ప్రముఖ జర్నలిస్ట్ సంచలన ట్వీట్..

ఢిల్లీ లిక్కర్ పాలసీ.. ఈ కేసులో ఇప్పుడిప్పుడే పురోగతి వస్తోంది. కుంభకోణంలో కీలకంగా ఉన్న వ్యక్తులను ఈడీ వరుసగా అరెస్ట్ చేసి.. విచారణ చేస్తుంది. శరత్ చంద్రారెడ్డి, మనీష్ సిసోసియా, అభిషేక్ బోయినపల్లి, కల్వకుంట్ల కవిత, కేజ్రీవాల్.. ఇలా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి.. వారిని విచారిస్తూ వస్తోంది. ఇటీవలే అభిషేక్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. కవిత అరెస్ట్, ఈడీ కస్టడీ, కేజ్రీవాల్ అరెస్ట్ వెంటవెంటనే జరిగిపోయాయి. సరిగ్గా ఇవి జరుగుతున్నప్పుడే.. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. కవిత అరెస్ట్ తర్వాత కూడా.. ఎలక్టోరల్ బాండ్ల విషయమై సుప్రీంకోర్టు ఎస్బీఐ పై సీరియస్ అయింది. అడిగిన వివరాలను సరిగ్గా ఇవ్వడం లేదని ఆగ్రహించింది. ఇక్కడ మీరు గమనిస్తే.. ఈ రెండింటికి ఏదో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది కదా.

 

సరిగ్గా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేశారు. శరత్ రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్. అతడిని ఢిల్లీ ఎక్సైజ్ కేసులో నవంబర్ 11, 2022 న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అరెస్ట్ అయిన నాలుగు రోజుల తర్వాత, అతను డైరెక్టర్‌గా ఉన్న అతని తండ్రి స్థాపించిన అరబిందో ఫార్మా, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బిజెపికి రూ. 5 కోట్లు చెల్లించింది. మే 2023లో రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు ED దానిని వ్యతిరేకించలేదు. PMLA(Prevention of Money Laundering Act)లో ఇలా జరగడం చాలా అరుదు. అంటే ఈడీ అరెస్ట్ తర్వాత.. బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో చెల్లించింది.

 

ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన శరత్.. మద్యం పాలసీ స్కామ్ కేసులో జూన్ 2, 2023న అప్రూవర్ గా మారాడు. అరబిందో ఫార్మా నవంబర్ 8, 2023న బాండ్ల ద్వారా మరో రూ.25 కోట్లను BJPకి విరాళంగా ఇచ్చింది. మొత్తం మీద కంపెనీ రూ.52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయగా, అందులో రూ.34.5 కోట్లు బీజేపీకి అందాయి. శరత్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసే ముందు అరబిందో ఫార్మా కూడా భారత రాష్ట్ర సమితి(BRS)కి రూ.15 కోట్లు, తెలుగుదేశం పార్టీ(TDP)కి రూ.2.5 కోట్లు విరాళంగా ఇచ్చింది.

 

2021-22లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కొన్ని నెలలపాటు ఈ విధానాన్ని అమలు చేసినపుడు, ఢిల్లీలో మద్యం లైసెన్స్ ప్రక్రియలో కిక్‌బ్యాక్‌లను తరలించడంలో శరత్ కీలక పాత్ర పోషించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ “సౌత్ గ్రూప్”గా పేర్కొన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తులలో శరత్, కవిత కూడా ఉన్నారు.

 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 21న కేజ్రీవాల్ అరెస్టయ్యారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఇదే కేసులో అరెస్టై.. ఫిబ్రవరి 2023 నుంచి జైలులో ఉన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |